Tuesday, March 22, 2011

అవినీతి లేని భారత దేశాన్ని చూడాలని కోరుకుంటున్నారా ?


ఏమిటి ?

స్వాత్రంత్రం వచ్చి 63 ఏళ్ళు అయినా,  మన దేశం శక్తికి తగ్గ అభివృద్ది జరగలేదు. ఎంత పురోగమించినా  సగటు భారతీయుని ఆదాయం పెద్దగా పెరగలేదు. ఇందుకు అవినీతి ఒక ముఖ్య కారణం. దేశం లో అడగడుగునా అవినీతి ఉందని కాదనలేని సత్యం. రాజకీయ నాయకులలో అధిక శాతం అవినీతి పరులని పసి పిల్లవాడిని అడిగినా చెబుతాడు. అవినీతి అంత సర్వ సాధారణం అయినా , గత రెండు సంవత్సరాలలో ఇది కనీ వినీ ఎరుగని  స్థాయిలో, సంఖ్యలు చూస్తే  కళ్ళు భైర్లు కమ్మే స్థాయిలో పెరిగింది. ఆదర్శ, కామన్ వెల్త్ , 2G  స్కామ్లు  దేశాన్ని  కుదిపేస్తున్నాయి. అవినీతి ఎంతకి  పేరుకుపోయిందంటే, ఆ సొమ్మును మనం విదేశీ బ్యాంకుల నించీ వెనక్కి తీసుకు రాగలిగితే ముప్పై ఏళ్ళు ... అక్షరాలా ముప్పై ఏళ్ళు  పైసా పన్ను లేకుండా దేశం నడవచ్చు అన్న స్థాయిలో. 

ఉపోద్ఘాతం  సరే .. అయితే ఇప్పుడేంటి అంటావ్ ?

ఇది భరించలేని కొందరు ఇలా చూస్తూ ఊరుకోవడం సరి కాదని నడుం బిగించారు. గళం వినిపించారు. విద్యాధికులు, న్యాయ మూర్తులు తదితరులు తయారుచేసిన జన్ లోక్ పాల్ బిల్ ను  పార్లమెంట్  లో ప్రవేశ పేట్టే వరకూ India against Corruption ఉద్యమం చేపట్టారు.  అదే సమయం లో భారత దేశం లో  అవినీతి కి విసుగెత్తిన ప్రవాస భారతీయులు కొందరు   "దేశం ఇంతే దీన్ని బాగుచెయ్యడం ఎవరి  వల్లా  కాదు" అని  కూర్చోకుండా  ఒక ఉద్యమం చేపట్టారు. Jan Lokpal Bill అమలు చెయ్యడం ప్రధమ లక్ష్యంగా,  అవినీతి వ్యతిరేక పోరాటాన్ని జనాలలోకి తీసుకెళ్ళే దిశగా ఒక  బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  






ఏంటది ? 

అదే రెండవ దండి పాదయాత్ర (Dandi March 2).  

అప్పుడు:

గాంధీజీ చేసిన దండి పాదయాత్ర 1930 మర్చి 12న సబర్మతి ఆశ్రమం దగ్గర మొదలై దండి వరకూ 24 రోజులపాటు 240 మైళ్ళు సాగింది ఆ పాదయాత్ర.. దేశ స్వాతంత్ర్య పోరాటం లో ఇదొక కీలకమైన మలుపు. 

ఇప్పుడు:

అదే స్ఫూర్తి తో, అవే తేదీలలో  అంటే  మర్చి 12 న మొదలై మర్చి 26 వరకు దక్షిన కాలిఫోర్నియా లోని శాన్ డియాగో లో  మార్టిన్ లూదర్ కింగ్ విగ్రహం దగ్గర మొదలై  అక్షరాల 24 రోజుల పాటు కాలిఫోర్నియా లో ప్రముఖ పట్టణాలలో సాగి 26న శాన్ ఫ్రాన్సిస్కో లోని గాంధీ విగ్రహం దగ్గర ముగుస్తుంది. అదే రోజున ప్రపంచం నలు మూలలలో  వివిధ పట్టణాలలో భారతీయులు ఈ పాద  యాత్రకి సంఘీ భావంగా పాదయాత్రలు చేస్తున్నారు.



ఈ  రెండవ దండి యాత్రలో   ఆరుగురు ప్రవాసులు మొత్తం నుండి చివరి దాకా అంటే 24 రోజులూ, 240 మైళ్ళూ  నడుస్తునారు. వారు జవహర్ కంబంపాటి , శ్రీహరి అట్లూరి, సుభాష్ కర్రి, 
వర్మ దంతులూరి, కేవల్ పర్నామి, శ్రీనివాసరావు నందివాడ (కింద ఫోటోలో చూడవచ్చు)  . 
వీరు ఉద్యోగాలకి శెలవు పెట్టి, కేవలం అవినీతిని ప్రతిఘటించడానికి, జనాలలో జన్ లోక్ పాల్ బిల్ (Jan Lokpal Bill) వస్తే కానీ దీనికి అంతం లేదనే అవగాహన పెంపొందించడానికి, ఆలోచన రేకెత్తించడానికి , నిజానికి దేశం లో అవినీతి అంతమొందాలి  అనుకునే ప్రతీ ఒక్కరి గురించి నిస్వార్థంగా నడుస్తున్నారు. కేవల్ పర్నామి గారి వయస్సు 70  ఏళ్ళు అని వినగానే ఆశ్చర్యం, ఆయనంటే గౌరవం కలగక మానదు.









సరే!... అయితే??....:



దేశం లో అవినీతి పోవాలి, కనీసం ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి, దేశాన్ని తిట్టుకుంటే సరిపోదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకునే వాళ్ళందరూ జన్ లోక్ పాల్ బిల్ అమలు చేయడం ఒక గొప్ప పరిష్కారం అని గుర్తించాలి.

"నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోస్తానూ " అంటూ ముందుకు  రావాలి. 

మీ గొంతు వినిపించాలి. మీ వంతు కృషి చెయ్యాలి.

రెండవ దండి పాదయాత్ర (Dandi March2)  ప్రయత్నం మీకు నచ్చితే, మీ భావాలకి దగ్గరగా ఉంటే   మీ సహకారం, మీ సంఘీభావం తెలపండి. ఈ  పాదయాత్రలో  మొత్తం 240 మైళ్ళూ  నడవడానికి పూనుకున్న ఆరుగురు ఎండనకా వాననకా రెండు వారాలగా నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కువగా జనాలు సపోర్ట్  చేస్తే ఈ ప్రయత్నం జనం లోకి వెళ్తోంది అన్న  ఆనందం తో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ఉపకరిస్తుందని గమనించండి.

అందుకని కాలిఫోర్నియా లో ఉన్నవారైతే మీ శక్తి కొలదీ 1,2,3,5,.. మైళ్ళు   వీరితో కలిసి నడవండి. వీలు కాకపోతే మీ పట్టణం లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళని పలకరించి మీ సపోర్ట్ తెలపండి.   అదీ వీలుకాకపోతే 26 న మీ పట్టణం లో జరిగే సమావేశం లో పాల్గొనండి. 






అది కూడా వీలుకాకపోతే ఇలాటి వాటిలో ఆసక్తి ఉన్న మిత్రులకి తెలియజేయండి. 

అది కూడా వీలుకాకపోతే.. ఇదంతా ఒక వెర్రి వాడి బాధని వదిలెయ్యండి.   అనవసరంగా చదివామనుకొని ఊరుకోండి . 
దేశం ఇంతే అని నిట్టూర్చి హాయిగా నిదరపొండి. శ్రీశ్రీ అన్నట్టు "... ప్రపంచం ఎట్లా పొతేనేఁ మీకెందుకు లెండి ... అదృష్ట వంతులు మీరు వడ్డించిన విస్తరులు మీ జీవితం." 



గమనిక
1.  ఆలోచన లోక్ సత్తా కార్య కర్తల దైనా, ఇందులో పార్టీలకి సంబంధం లేకుండా ఎవరన్నా పాలుపంచుకోవచ్చు. చాలా సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతుగా నడుస్తున్నాయి, సహకరిస్తునాయి.   
2. రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడుతున్నాం కానీ, మనం లంచాలని ఇవ్వట్లేదా, తీసుకోవట్లేదా అనేది చొప్పదంటు ప్రశ్న కాకపోయినా (ఈ మీమాంస లోనే ఇన్నాళ్ళు దీని గురించి రాయలేదు )  ఈ వ్యాస పరిమితి మించిన ప్రశ్న అని నా ఉద్దేశ్యం. లంచం ఇవ్వడం తీసుకోవడం తప్పే కానీ  తప్పక, గత్యంతరం లేక  ఇస్తున్నవారే ఎక్కువ.  ఇప్పుడు కోరుకునే మార్పు ఆ అవకాశం లేని సమాజం ఏర్పరిచే దిశగా వెళ్తుందనే పాజిటివ్ ఆలోచనతోనే రాయదలచుకున్నాను.  

చివరిగా ఇందులో చరిత్ర పరంగా కానీ ఫాక్ట్స్ కానీ ఏమన్నా తప్పులుంటే చెప్పగలరు. సరి చేసుకుంటాను  



Sunday, March 20, 2011

ఎవడో రాజమండ్రి - భద్రాచలం లాంచీ లో వెళ్ళచ్చన్నాడు.. వాడిని !#%^^!@%& - మొదటి భాగం


"వారిని! ఇవేనా అలిపి బ్యాక్ వాటర్స్ అంటే. మా అయినాపురం లో మురిక్కాలువ అంత ఉంది దీని  వెడల్పు  . దీనికి పదకొండు వేలు, పెద్ద హడావుడి. కోనసీమ లో ఇలాటి బోట్లు  పెడితేనా "God's own county" అనేస్తార" న్నాను  

"అయితే ఈసారి తీసుకెళ్ళరా. మేమూ చాలా విన్నాం"

"సరే ఐతే ఈసారి అక్కడికే. మీరు కోనసీమ చూడలేదు. నేను పాపి కొండలు చూడలేదు. ఒకే ట్రిప్పుకి రెండు ... "

"సర్లే. ట్రై చేసింది చాలు. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యి. " చిరాగ్గా సెలవిచ్చాడు కిరణ్.

ఆ కేరళ ట్రిప్ ఐపోయాకా,లీవ్ తీసుకున్న నేరానికి నాకు ఆర్నెల్లు కఠిన క్యూబికల్ శిక్ష పడి పనిలో మునిగి తేలి, యత్రాలంటే భయం, లీవంటే  వణుకు పట్టుకున్నాయి.

శిక్షా కాలం ముగిసాకా ఒకనాడు స్నేహితులతో  కలిసి అనుకోకుండా గోదావరి సినిమాకి వెళ్లాను.

కట్ చెయ్యకుండానే ... నెలలో ఒక లాంచీ యజమాని కాంటాక్ట్ దొరకడం అతను మమ్మల్ని బ్రహ్మి (సా. ఇ ) అని తెలిసి వాయించి వదలడం, రాజమండ్రి నించి భద్రాచలం కి లాంచీ కుదరడం  చక చకా జరిగి  పోయాయి.

                          
                  **********************************************


రెండు వారాల తరువాత...

మా ప్రయాణం రోజు రానే వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ లో మేము ఏడుగురం స్నేహితులం కలుసుకున్నాం.

గౌతమీకీ గార్డ్ సిగ్నల్  ఇచ్చాడు. రైలు  బయల్దేరింది.

కానీ ముందు ఏదో జరగబోతోంది అన్నట్టు ట్రైన్ స్లో మోషన్ లో కదలలేదు, ఆకాశం మేఘావృతం కాలేదు, మెరుపులు మెరవలేదు, ఉరుములు ఉరమలేదు. ప్రకృతి బొత్తిగా ఏ క్లూ ఇవ్వలేదు.

మర్నాటి ఉదయం  మాలతి గారి ఊరిలో దిగాం. అదేనండీ నిడదవోలు.

అక్కడికి మా పెదనాన్న పంపిన సూమో ( ఈ మాట వినగానే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనేసుకోవడమే. ఇది కోనసీమ. రాయలసీమ కాదు.) ఎక్కి అరగంట లో చాగల్లు చేరుకున్నాం. ఈ ఊరు షుగర్ ఫ్యాక్టరీ కి ప్రసిద్ది మా అమ్మమ్మ వాళ్ళ వంశం లాగా. సీజన్ అనుకుంటా ఎక్కడ చూసినా చెరుకు కనపడుతోంది.
ఇంటికి చేరగానే మా గ్యాంగ్కి  ఇంటి టూర్ ఇచ్చి, కాఫీలిచ్చి, టిపినీలు పెట్టింది మా దొడ్డమ్మ. వేడి వేడి పెసరట్టుని  ఉప్మా తో ఒక పట్టు పట్టాం  అందరం. బుద్ధిగా స్నానం చేసి, శ్రద్ధగా దండం పెట్టుకుని పట్టి సీమకి  బయల్దేరాం.

ఆ రోజు ప్రయాణం ...పట్టి సీమ, గోదావరి మీద లాంచీ, పాపి కొండలు, భద్రాచలం.. తలుచుకుంటే కడుపు నిండి ఆ తిండి ఆకర్లేదని పించింది.

పట్టిసీమ ఇవతల ఒడ్డుకి చేరుకున్నాం. అక్కడే మా లాంచీ, దాని యజమాని/మా టూర్ గైడ్ తాతాజీ కనిపించాడు.    దగ్గరలో ఉన్న  ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి  దండం పెట్టించి, లాంచీ ఎక్కించాడు (ఇందులో మతలబు బోధపడలేదు అప్పుడు ).  ఈ లాంచీ మొత్తం మీ కోసం, ఎవరిని ఎక్కించం, ఇందులో మీకు అన్నీ రెడీ - కాఫీలు, టిపినీలు, భోజనం అని చెప్పుకొచ్చాడు. మేము అనుకున్నంత కాకపోయినా బానే ఉందనిపించింది. ఫోటోలు తీసుకున్నాకా, లాంచీ రయ్యంది, అయిదు నిమిషాలలో అవతలి ఒడ్డున ఉన్న పట్టి సీమకి  చేరుకున్నాం. ఆ ఇసుక తెన్నెల్లో దిగగానే శంకరభరణం, వంశీ సినిమాలు గుర్తొచ్చాయి.  అద్భుతంగా ఉంది, గోదారి వడిలో, నీటి చప్పుడులో, సేద తీరడానికి భలే స్పాట్ సెలెక్ట్ చేసుకున్నావు కదయ్యా వీరేశ్వరా అనుకున్నాను.  

దర్శనం చేసుకుని లాంచీ చేరుకున్నాం. వాడిచ్చాడు కదా అని టిపినీ కొంచం టేస్ట్  చేసి లాంచీ పైకెక్కి  సై అన్నాం. క్లీనర్ రై రై అన్నాడు. లాంచీ నీటి తెరలను చీల్చుకుంటూ ముందు కెళ్ళింది. సూత్రధారులు సినిమాలో సత్య నారాయణ లాగా కూర్చిలో కూర్చుని గోదావరిని చూస్తూ కూర్చున్నాం. చూడడానికి ఇంకో రెండు కళ్లుంటే బావుండనిపిచింది. కొంత సేపయ్యాక కిందకు దిగి, లాంచీ వంచ మీద  కాళ్ళు నీళ్ళల్లో పెట్టి కూర్చుంటే, ఆ వడికి, నీటి తుంపరలు ఎగిరి పడుతుంటే, చల్లని ఏటి గాలి తడుతుంటే స్వర్గం దీనికి దిగదుడుపేమో  అనిపించింది.


ఆ హాయిలో గంటలు నిమిషాలు లా గడిచిపోయాయి. సుమారు ఒంటి గంటకి పాపి కొండల దర్శనం ఐంది.  "అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా" అని వేటూరి చెప్పినట్టు, గోదారి నవ్వుతున్నంత ఆహ్లాదంగా ఉంటుంది, ఆ కొండలను కడుగుతునట్టే ఉంటుంది. చాలా సేపు చూడనిచ్చాక తాతాజీ లాంచీ ని  ఒక తాండా దగ్గర ఆపాడు. అక్కడే మా మధ్యాహ్న భోజన పధకం అన్నమాట. అసల ఒక్క పదార్ధం కూడా తినలేక పోయాము. కొంత సేపు ఆ వ్యూ పాయింట్ నించీ గోదారిని తనివి తీరా చూసి బయల్దేరాం.



గోదావరి లో నీరు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల, భద్రాచలం వరకూ లాంచీ వెళ్ళదని చావు కబురు చల్లగా సెలవిచ్చాడు తాతాజీ. అందువల్ల మా ప్రయాణానికి చిన్న మార్పులు చేర్పులూ చేసి మమ్మల్ని పోచవరం లో దింపుతా  అన్నాడు.  అక్కడి నించీ బస్సు పట్టుకుంటే కూనవరం, అక్కడ ఇంకో  బస్సు పట్టుకుంటే భద్రాచలం.
ఓస్ ఇంతేగా అనుకున్నా, మా గత ప్రయాణాల అనుభవాల వల్ల ఏదో తేడా కొట్టింది. భారం రాముడి మీద వేసి  బయల్దేరాం.

పోచవరం చేరే సరికి సాయంత్రం ఆరయ్యింది. అదో చిన్న పల్లె. ఒక డజను ఇల్లుంటాయేమో. ఇక్కడికి బస్సు కూడా వస్తుందా అని ఆశ్చర్య పోయాం. కానీ మా ఆశ్చర్యాన్ని పటాపంచలు చేస్తూ మాకు భయం కలిగించే విషయం చెప్పాడు తాతాజీ - ఆఖరి బస్సు మూడింటికే వెళ్ళిపోయిందని. గుండెలో రాయపడినా, తాతాజీ ఏదో మార్గం చూస్తాడులే అని ధైర్యం. ఆటోలు ఎమన్నా ఉన్నాయేమో అని కనుకున్నాడు. ఆటో కాదు కదా కనీసం ద్విచక్ర వాహనం కూడా ఎవరికీ లేదు ఆ పల్లెలో. వాళ్ళనీ వీళ్ళని కనుక్కొని  అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరుందని, అక్కడ ఆటో లేమన్నా దొరకచ్చని, లాంచీ లో ఉన్న మా సామాను తీసుకోమని సెలవిచ్చాడు తాతాజీ.
మాకొచ్చిన కోపానికి తాతాజీ ని కాలు కిందేసి తొక్కేయాలని పించింది. కంట్రోల్ చేసుకుని, సమస్య సామరస్యం గా చర్చించి, భద్రాచలానికి ఏదో ఒక వాహనం దొరికే ఊరి వరకూ మాకు తను షెల్టర్ ఇవ్వడానికి, అతనికి మేము  కంపెనీ ఇవ్వడానికీ  ఒప్పందం చేసుకున్నాం.

ఈలోపు మా పరిస్థితికి సింబాలిక్ గా చీకటి పడింది. గోదావరి ఉదయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో రాత్రి అంత భయపెడుతుందని మాకు అప్పుడే తెలిసింది. కనుచూపుమేర జనాలు లేరు. చిక్కటి రాత్రిలో నల్లటి ఆకాశం లో డిమ్ గా వెలుగుతున్న చుక్కల వెలుతురులో బోటు సాగుతోంది, భయం పెరుగుతోంది, గుండె వణుకుతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రా సాగాయి. ఈత రాని మేము నీటిలో పడితే, ఇంధనం లేక పడవ ఆగిపోతే, మమ్మల్ని వీడు ఇక్కడే  వదిలిపోతే.... గోదావరిలో హైదరాబాద్ పిల్లలు గల్లంతు అనే న్యూస్ .. వరకూ వెళ్ళిపోయాయి ఆలోచనలు.

ఈలోపు ఇంకో చిన్న పల్లె వచ్చింది (అనుకున్నాం). తాతాజీ పడవని ఒడ్డు దాకా పోనివ్వడం, టార్చీ లైట్ ఊపడం, అక్కడినించీ ఎవరన్నా సిగ్నల్ ఇస్తారేమో అని. నాకైతే అన్వేషణ సినిమా గుర్తొచ్చింది. ఇలా రెండు మూడు చోట్ల ఆపగా ఒక చోట అటు నించీ సిగ్నల్ వచ్చింది. తాతాజీ, ఇంకో ఇద్దరం వెళ్లి కన్నుక్కోగా, ఆ ఊరు జీడికుప్పని,  ఒకే  ఆటో ఉందని, అక్కడినించీ కూనవరం ఒక గంట పడుతుందని తెలిసింది. చిన్న ఆశ చిగురించింది. ఆరుగురు మంది లగేజీ తో ఆటో లో ఎలా పడతాం అని కూడా ఆలోచించలేదు. తాతాజీ ని ఏం చేసినా పాపం లేదని అనుకుని ఎలాగో సద్దుకున్నాం. ఆ ఆటో వాడు ఒక పిల్లాడిని కూడా తెచ్చుకున్నాడు. తోడుకేమోలె అనుకున్నాం. కానీ  టార్చీ లైట్ పట్టుకోడానికాని   ఆ తరువాత తెలిసింది - ఆ ఆటోకి హెడ్ లైట్ లేదు.

ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా  ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్  వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది.   అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెలో రైళ్ళు పరిగెత్తించాడు.


ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా బ్రహ్మేమో, చెప్తే నవ్వుతారని  ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..



.............. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం.....

రెండవ భాగం  - ఇక్కడ