Sunday, June 6, 2010

వేదం - ఇలాటి సినిమా తెలుగులో రాలేదు


గమ్యం సినిమా నాకు పెద్ద గొప్ప సినిమాలాగా అనిపించలేదు. కొంచం విభిన్నంగా ఉన్నఒక మామూలు సినిమా.
ఎందుకు ఈ దర్శకుడిని ఇంత ఎత్తేస్తున్నారు? బహుశా అతనికి సినిమా వాళ్లతో ఉన్న పరిచయం వల్లనేమో అనుకున్నాను. సాధారణంగా మొదటి సినిమా తో పైకెగిరి రెండవ సినిమాకి చతికిల పడే దర్శకుల్లో చేరిపోతాడేమో అనుకున్నాను. కానీ వేదం చూశాక ఇతను మంచి విషయం ఉన్న దర్శకుడు అని తెలిసింది.
అయిదు పాత్రలు, వారి కథలు ఒక చోట కలవడం. అది వారి జీవితాలని మలుపు తిప్పడం వేదం కథ అని చూచాయిగా తెలిసింది మీడియా లో సినిమా గురించి ఊదరకొట్టడం వల్ల. ఆడియో నాకు వినగానే బాగా నచ్చింది ముఖ్యంగా "మళ్ళీ పుట్టనీ", "ఏ చీకటీ" పాటలు. సాహిత్యం కూడా చాలా చక్కగా ఉంది. సరిగ్గా వాడుకుంటారా సినిమాకి అన్న అనుమానం మొదలైంది.
రకరకాల సమీక్షల  ద్వారా పాజిటివ్ టాక్ చూసి సినిమా బానే ఉంటుందిలే అనుకునే బయల్దేరాం. బే ఏరియా లో తెలుగు సినిమాకి  హాలు నిండడం, టికెట్ లు అయిపోయాయని ఇంకో ఎక్స్ట్రా షో వెయ్యడం మగధీర తరువాత ఇదేనేమో. 



సినిమా మొదలైంది. ఒక్కొక్క పాత్రని ప్రవేశపెట్టడం మెల్లగా కథని ఆవిష్కరించడం బావుంది. మనోజ్ పాత్రకి ఇంకెవరి నయినా పెట్టాల్సింది.  ఇంటర్వల్ సమయానికి బాగా తీసాడు, ఎక్కడా బోర్ కొట్టలేదు అనుకున్నాం (ఈ మధ్య ఇది కూడా కష్టం అయిపోయింది తెలుగు సినిమాలలో). ఇంటర్వల్ తరువాత ఇక కథలో లీనమయిపోయాం.క్లైమాక్స్ కి జనం నించి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పాత్రలు తప్ప నటులు కనపడలేదు. ముఖ్యంగా అనుష్కా, అల్లు అర్జున్ బాగా చేశారు. అనుష్కా కి స్నేహితురాలి(/స్నేహితుడి)గా చేసిన నటుడు అద్భుతంగా చేశాడు. నాకు మధుర్ బండార్కర్ సినిమాలలో కనిపించే పాత్రలు గుర్తొచ్చాయ్. ఇంచు మించు అందరు నటులు తమ పాత్రలకి ప్రాణం పోశారు.
ఈ సినిమాకి నిజమయిన హీరో క్రిష్. ఇతను ఇలాటి కొత్త రకం తెలుగు సినిమాలు తీసి మున్ముందు కొత్త శకం తెలుగు సినిమాకి ప్రతినిధి అవుతాడని ఒక ఆశ కలిగింది. నాకు కొత్త వారిలో (గత దశాబ్దం అనుకోండి) శేఖర్ కమ్ముల, సుకుమార్, చంద్ర శేఖర్  యేలేటి  సినిమాలు నచ్చుతాయ్. కానీ  అన్నిటిలోనూ ఏదో వెలితి ఉంటుంది.    శేఖర్ కమ్ముల సినిమాలలో టెక్నికల్ గా పర్ఫెక్షన్ ఉండదు. సినిమా మాధ్యమాన్ని బాగా వాడుకుని కథని ఎలివేట్ చేసే శక్తి లేదు కమ్ములకి. సుకుమార్ టెక్నికల్ గా పెర్ఫెక్షన్ ఉంటుంది, టేకింగ్ స్టైలిష్గా  ఉంటుంది   కానీ కథ లో ఏదో లోపం , వెలితి కనిపిస్తాయ్.లేకపోతె ఏదో ఎక్కడో తేడా చేసేస్తాడు.  ఇక చంద్రశేఖర్ యేలేటి. నాకు అనుకోకుండా ఒక రోజు చూసి మైండ్ బ్లాక్ ఐంది. తెగ నచ్చింది. ఇతని సినిమాలు ప్రయాణం తప్ప అన్నీ ఇష్టం నాకు. కాకపోతే కొంచం స్లో గా ఉంటాయ్.
వేదం లో మాత్రం క్రిష్ అనీ బాగా బ్యాలెన్స్ చేసాడు అనిపించింది. టెక్నికల్ గా పేరు పెట్టడానికి ఏం లేదు. కథ, కథనం, మాటలు చక్కగా రాసాడు. ఆర్ట్ ఫిలిం లా కాకుండా కమర్షియల్ సినిమా తీసాడు కొత్త కథ అయినా. ఇలాటి సినిమాలు మున్ముందు బోలెడు వచ్చి ఆరు పాటలు ఏడు ఫైటులు, పాత చింతకాయ పచ్చాడి కథలు, తాతల నాటి కథనాల నించీ తెలుగు సినిమాలు బయటపడాలని ఆశిస్తున్నాను.

Friday, March 26, 2010

పవర్ కట్




ఒక శనివారం 1992,
హైదరాబాద్ 
"అక్కా బయిటికి వెళ్దాం  రావే. ఎంచక్కా ఆడుకోవచ్చు. కరెంట్ వచ్చేవరకు"
"వద్దులేరా తెలుగు వార్తలు అయిపోయాయి. ఉర్దూ వార్తలు కూడా ఐపోవచ్చాయి. మనం వచ్చే లోపు కరెంటు వచ్చేస్తే సినిమా కొంచం మిస్ ఐపోతాంరా"
"కరెంటు అప్పుడే రాదే. పెద్ద మంట వచ్చింది ట్రాన్స్ ఫార్మర్ నించీ. ఎలెక్ట్రిక్  అంకుల్ రావడానికే గంట పడుతుంది."
"నీకెన్ని సార్లు చెప్పాను. ఎలెక్ట్రిక్ కాదు లైన్మెన్ అంకుల్ అని"
"అలా ఐతే నాన్న రోజూ రిక్షవాడిని. ఆటో వాడిని, షాపు వాడిని అందరినీ అంకుల్ అనకూడదు అని చెప్తే నువ్వు విన్నావేంటి. ఇప్పుడదంతా ఎందుకు. పక్కింటి ప్రియాంకా, ఎదురింటి తేజా కూడా వస్తారు. పద త్వరగా. రాత్రి 'కరెంట్ షాక్' ఆడితే భలే ఉంటుంది."
----- 



ఒక వేసవి రాత్రి , 1997
ఐనాపురం 
"అప్పుడే మొదలెట్టేశారా.. రాత్రైతే చాలు. కరెంటు పోయి చీకటిలో మొహాలు కనపడవేమో ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచించకుండా, మరీ ధైర్యంగా పాడేస్తున్నారు.  ఈ అంతాక్షరీ తో హడల కొట్టేస్తున్నారు. హాయిగా పెందరాడే పడుకోవచ్చు కదా. మేమైతే తాతయ్య పొలం నించి వచ్చేసరికి పడుకునే వాళ్ళం తెలుసా. ఇక మా అమ్మమ్మా వాళ్ళింట్లో ఐతే అయిదింటికి రాత్రి భోజనాలు. ఆరింటికి పడక."
"మావయ్యా. మీకు అదే  అలవాటు ఐపోయినట్టుంది. ఏడైతే  చాలు తెగ తూలిపోతారు. రాత్రి నిద్రకు ఆగలేరు. పొద్దున్నే మమ్మల్ని లేపకుండా ఉండలేరు. కనీసం ఎనిమిదింటి వరకూ కూడా పడుకోనీకుండా ఏంటిది."
"బాబయ్యా. మీ ఊళ్ళో సగం సేపు కరెంటు ఉండదు. మేము వచ్చినప్పటి నించీ ఒక్క రాత్రి అయినా కరెంటు ఉందా. టీవీ చూడలేం. బయటకెళ్ళి ఆడలేం. పోనీ ఊరంతా షికారు కెల్దామంటే మీ భయం తో మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. మర్రిచెట్టు వరకూ వెళ్ళేలోపు వెతకడం మొదలెట్టేస్తావ్ ఎక్కడున్నామా అని."
"నాన్నా ఆకోనీ..  నువ్వు యెల్లి పో. 

బావా ఇప్పుడు ప తొ పాదాలి నువ్వు "
------ 



ఒక బ్యాడ్ డే కి ముందు డే, 2001 
హైదరాబాద్ 
"రేయ్. ఏంట్రా ఇది. సిరాకు దొబ్బుతోంది. మొన్నటి దాకా ర్యాగింగ్. ఫ్రెషర్స్ ఐంది కాస్త ఎంజాయ్ చేద్దాం అనేలోపు ఈ ఎగ్జామ్స్ ."
"ఔన్రా. అయినా ఈ తొక్కలో ఇంజనీరింగ్ లో చేరకూడదు రా . చేరినా జే ఎన్ టి యు లో అసల జేర కూడదు. ఏడాదికి ఆరు ఇంటర్నల్సా. మొదలెట్టింది డిసెంబర్లో, ఆగష్టు లో ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్. అంటే ప్రతీ నేలా ఏదోకటి రాస్తూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ సెం మరీ ఘోరం."
"మీరిద్దరూ ఆపండిరా. తొక్కలో డిస్కషన్. నేను రాజు గాడు ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్."
"ఎందుకు రా.. ఆడు అసలే  పరమ ఐరన్ లెగ్గు కదా"
"అందుకేరా. మనం చేసేదే వన్  డే బ్యాటింగ్. రేపు ఎగ్జాం పెట్టుకుని ఈ రోజు కూడా చదవకపోతే ఎదవ గిల్టీ ఫీలింగ్. పైగా మా నాన్న ఇదే పాయింట్ మీద ఏడాది దెప్పు తాడు. అదే కరెంట్ పొతే ఒక తొక్కలో ఎక్స్క్యూస్ అయినా ఉంటుంది."
"ఏడిసావ్లే. నీ తొక్కలో రీసనింగ్ నువ్వూ. మీ నాన్న జెనరేటర్ అద్దెకి తెచ్చి అయినా ఈ రోజు మీ ఇంట్లో కరెంట్ ఉంచుతాడు."
"రేయ్. రాజు గాడొచ్చాడు!!"
"కరెంట్ పోయింది"
"పదండ్రా.. నాకు బుర్ర హీటెక్కి పోయింది. చాయ్ పడాలి. అలా ఒక రౌండ్ ఏసోద్దాం."
-------- 



ఒక కరెంటు పోయిన రాత్రి, 2010 
బే  ఏరియా (కాలిఫోర్నియా)లో అమెరికన్లకంటే తెలుగు వారు ఎక్కువగా  ఉండే ఒకానొక నగరం.  
"వాట్. కరెంటు పోయిందా. నీ మొహం. ఆ ఫ్యూజ్ ట్రిప్ అయ్యి ఉంటుంది. సరిగ్గా చూడు"
"లేదు ఎవరికీ లేదు. జంక్షన్ లో ట్రాఫిక్ లైట్స్ కూడా పని చెయ్యట్లేదు. తెలుసా"
"ఔనా. Strange. ఇది నేనిక్కడికి వచ్చినప్పటి నించీ జస్ట్ రెండవ సారి అనుకుంటా. మూడేళ్ళలో "
"నేనొచ్చాకా అసల ఇదే మొదటి సారి"
"కాల్ చేసావా"
" గంట వరకూ రాక పోవచ్చని చెప్పారు. ఏం  చేద్దాం."
"వాక్  కెల్దామా?"
"నువ్వేనా ఆ మాటన్నది.. :)... ఓకే "
"అబ్బ.. ఎన్నాళ్ళయిందో.. చీకట్లో.. కటిక చీకట్లో.. ఇలా ..ఆకాశాన్ని చూసి.  పాలవిల్లుకి కట్టిన పళ్ళలా వేలాడుతున్నాయి కదూ నక్షత్రాలు. చంద్రుడు మరీ ముద్దొచ్చేస్తున్నాడు. బ్లాకు డ్రెస్ లో ఉన్న తమన్నాలా..  ఎపుడో  చదువుకునే రోజుల్లో చూసా."
"ఎవరిని?"

"కంగారు పడకు. తమన్నా అప్పటికి  సినిమాలలో రాలేదులే..






.. ఔను.. రోజూ ఇలాగే ఉంటుందా?"

" హ్మ్..  ఏమో. అవి ఆకాశంలోకి వచ్చేలోపు నువ్వు ఇంటికి రావు. నువ్వు వచ్చాక మనం బయటకి వెళ్ళం."
"ఛ. రోజూ ఒక గంట కరెంటు పోకూడదూ.."
"అబ్బా. ఎంతాశో.. ఇది అమెరికా. ఇప్పటికే టీవీ లో ఇదో పెద్ద న్యూస్ అయిపోయి ఉంటుంది. "
"ఏంటి మనం వాక్ కి రావడమా..??"
"హ్మ. $!@#$&#*($)_)(_)"
------
P.S. బే  ఏరియా  లో మొన్న రెండు నగరాలలో 85 నిమిషాలపాటు ఏక బిగిన పవర్ కట్.

Wednesday, March 24, 2010

శ్రీ రామ నవమి అనగానే....


శ్రీరామ నవమి అనగానే గుళ్ళలో పందిళ్ళు, వడపప్పు పానకాలు, సీతారామ కళ్యాణం, ముఖ్యంగా ఊళ్ళల్లో ఐతే పండగ అనే కంటే ఒక పెళ్లి వాతావరణం ఉంటుంది. పెళ్లన్నా, పెళ్లి హడావుడి అన్నా ఇష్టం లేని వాళ్ళెవరు? బహుశా అందుకేనేమో నాకు శ్రీ రామ నవమి అంటే పండగలలో ప్రత్యేకమయిన ఇష్టం. శ్రీ రాముడు దేవుడన్న విషయం పక్కన పెట్టినా, రాముడు ఆదర్శ పురుషుడికి ప్రతిరూపం. రామాయణం - మనిషి ఎలా బతికితే మనిషి అనిపించుకుంటాడో చెప్పే ఒక గైడ్. సమాజం సవ్యంగా నడవడానికి ఒక మార్గం. దానిలోని సారాన్ని గ్రహించి ప్రస్తుత పరిస్థితులకి అన్వయించి వాడుకుంటే రామాయణ పరమార్థం అవపోసన పట్టినట్టే అని నా ఉద్దేశ్యం.
సీతారాముల శుభ చరితం రస భరితం ఇది నిరితం
కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం


అందుకే అనుకుంటా ఎన్ని రామాయణాలు వచ్చినా, రామాయణం లోంచి ఎన్ని కథలు వచ్చినా అతి మధురంగా ఉంటాయి. ఎన్ని సార్లు చూసినా విన్నా తరగని సుధలా మనసుకు విందు చేస్తుంటాయి. అన్నమయ్య రామచంద్రుడితడు అన్నా, త్యాగయ్య జగదానంద కారకా అన్నా- రామదాసు అంతా రామమయమన్నా మది పారవశ్యంతో పులకిస్తుంది. భక్తితో ఆనంద తాండవం చేస్తుంది. రామగానామృతం లో ఆర్తిగా తడుస్తుంది.



శ్రీ రామ నవమి రాముడి పుట్టినరోజు అయినా ఆ రోజు సీతారామ కళ్యాణానికే ప్రాముఖ్యత (ఎందుకా అని అడిగాను కొంతమందిని. కొంతవరకూ తెలిసింది. పెద్దలు ఎవరన్నా ఇంకా విపులంగా వివరిస్తే తెలుసుకోవాలని ఉంది). భద్రాద్రి లో కళ్యాణం కనులపండువుగా జరుగుతుందని వినడం, టీవీ లలో చూడడమే కానీ ఎప్పుడూ అక్కడ చూసే అదృష్టం ఇంకా కలగలేదు. నవమికి కాకపోయినా గోదావరి మీద (లాంచీ లో) ఒకసారి భద్రాచలం వెళ్లి దర్శించుకున్న తృప్తి మాత్రం ఉంది.


అమెరికాలో శ్రీ రామ నవమి అనగానే నాకు, చాలా మందికి పడమటి సంధ్యారాగంలో ఒక సన్నివేశం స్ఫురణకొస్తుంది. అందులో, ఆ రోజు శ్రీ రామ నవమని కూడా తెలియలేదని, స్వదేశం లో ఉంటే ఎంతో బాగా జరుపుకునేవాడినని ఒక ప్రవాసాంధ్రుడి బాధ. అదృష్టవశాత్తు గత దశాబ్ద కాలంలో ఇక్కడ మన జనాభా పెరగడం వల్లనైతే నేమి, మారిన ప్రచార మాధ్యమాల వల్లనైతేనేమి అలాటి అవస్థ లేదు. వారం ముందు నించే పండగ గురించి తెలిసిపోతోంది. గత ఏడాది లాగా వారంతం లో వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది నవమి. ప్రశాంతంగా రాముడిని స్మరించుకోడానికి, పానకం, వడపప్పు , చలివిడి సావకాశంగా తినడానికి వీలు చిక్కుండేది. 


శ్రీరామ నవమి అనగానే సీతారాముల కళ్యాణం, అది తలుచుకున్నప్పుడు ఎన్ టి ఆర్ గారి సీతా రామ కళ్యాణమో బాపు గారి సీత కళ్యాణమో గుర్తుకు రాకమానదు. రెండూ నాకు భలే ఇష్టం. అందులో సీత కళ్యాణం ముఖ్యంగా రామాయణం మొత్తం ఒక నృత్య రూపకం లా చిత్రించడం నాకు భలే ఇష్టం. సీత రాముల బాల్యం, దశావతారాలు (ముఖ్యంగా వామనావతారం), విశ్వామిత్రుడు చెప్పే కథలు , సీతా రాముల కళ్యాణం అంత అందంగా తియ్యడం నేనే సినిమాలోనూ చూడలేదు. నేను ప్రతీ నవమికి ఆనవాయతీగా ఈ సినిమా చూస్తాను. రేపు సాయంత్రం కుదరకపోతే కనీసం వారంతమయినా చూడాలి.


మాకింకా నవమి రాలేదు కాబట్టి గత నవమి పానకం,వడపప్పు (ఫోటో మాత్రమే) ఇదిగో మీ కోసం.
అసల విషయం మర్చిపోయా.. మీకందరికీ  
                                            శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 








P.S.  రామ కీర్తనలు (సినిమలలోనివి కానివి కూడా) వినాలంటే పైన వినచ్చు.

                                                      ---    లోకాస్సమస్తాత్ సుఖినో భవంతు  ---

Saturday, March 20, 2010

కారం చట్నీ (అయినాపురం కథలు)





నలభీమ పాకం అంటారు కానీ మా అమ్మమ్మ వంట కంటే అది గొప్పగా అయితే ఉండదని  నా  నమ్మకం. ఏ వంట అయినా అలవోకగా చేసేస్తుంది అమ్మమ్మ.  అద్భుతంగా ఉంటుంది. అది గుత్తొంకాయ అయినా , గుమ్మడి వడియాలయినా, కందా బచ్చలయినా.. కందిపొడి అయినా సరే.  ఇంత విద్య ఊరికే పోతోందే అమ్మమ్మా  అంటే,"ఊరి కే పోతోంది రా " అని చమత్కరించేది.  ఒక కుక్ బుక్ తయారుచేస్తే బావుంటుంది అనిపిస్తుంది నాకు.కానీ అంత వంట వచ్చిన మా  అమ్మమ్మ చేసే ఇడ్లీ మాత్రం మా సూరయ్య హోటల్ ఇడ్లీ.. కాదు కారం చట్నీవిత్ ఇడ్లీ (క్రమం కరెక్టే)  ముందు దిగదిడుపు.
మా వీధి చివర కుట్టు మిషను కాంతారావు కొట్టుకి ఎదురుగా పాకలో చిన్న హోటల్ సూరయ్యది. అయినాపురం మొత్తానికి ఏకైక హోటల్. అయినాపురం వచ్చినప్పుడు అది వెతకకండే.. దానికి బోర్డు గట్రా ఏమీ ఉండవు. ఊరిలో ఎవరినయినా  అడిగితే  మాత్రం జబ్బట్టుకుని తీసుకొచ్చేస్తారు. బోర్డు మీద పేరు లేకపోయినా ఊరిలో మాత్రం తెగ పేరుంది ఆ హోటల్ కి. అందరూ సూరయ్య హోటల్ (కొంత మంది ముద్దుగా సూరి గాడి హోటల్) అని అంటారు. హైదరాబాది బిరియానీకి ప్యారడైస్, బావర్చి లాగ మా ఊరిలో టిఫిన్లకి అది పెట్టింది పేరు.
నాలుగు చక్క బల్లలు, పాత సినిమా పోస్టర్లు (ఎక్కువగా ఎన్టీ వోడివే) కప్పుకున్న గోడలు,  ఒక బుల్లి వంట గది, బోలెడు జనం దాని ట్రేడ్ మార్క్.  ఉదయం అయిదు నించీ ఏడింటి వరకే తెరిచి ఉంటుంది. తాతయ్య తో వెళ్తే అక్కడే తినేవాళ్ళం. కానీ తాతయ్యేమో ఉదయాన్నే వెళ్ళిపోతాడు తినడానికి. మేము లేచేసరికి ఆయన తిని రావడం కూడా అయిపోయేది. అందుకని ఇంటికే తెచ్చుకునే వాళ్ళం.హోటల్ ఎప్పుడూ కిక్కిరిసి ఉన్నా మేము వెళ్ళగానే సూరయ్య పలకరించే వాడు. మేము ఏమీ చెప్పకుండానే "వాయవుతోంది బాబూ. యేడి యేడి గా యేసిస్తాను. కూకోండి" అని మేము తెచ్చిన స్టీల్ బకెట్, గ్లాసులు లాక్కునేవాడు. దేవత పోస్టర్ మీద పేర్లన్నీ చదివే లోపు బకెట్ నిండా ఇడ్లీలు, దాని మీద విస్తరాకులు, గ్లాసుల నిండా చట్నీలు నింపి తెచ్చేవాడు. ఇడ్లీల కన్నా ముందు చట్నీ ఉందో  లేదో చూసుకుని అతను  "మీ తాతయ్య ఖాతా లో వేసుకుంటా బాబూ" అని  అనగానే  ఇంటికి పరుగు తీసేవాళ్ళం. ఇలాటి ఇడ్లీలు రూపాయికి నాలుగా అని ఆశ్చర్యంగా ఉండేది.
ఇంటికి పరుగెడుతుంటే, ఒక్కోసారి పక్కింటి అరుగు మీద ఆయన సిగ్నేచర్ పంచెతో అర్థ దిగంబరంగా కూర్చునే రాజు గారు ఆపేవారు. "ఏంటి హోటల్ నించీ వస్తున్నారా. అచ్చియ్య (ఆయన భార్య) ఏమీ చెయ్యలేదు.  శివగాడు గోల పెడుతున్నాడు..............." అని ఆయన ఏడ్పుల చిట్టా విప్పేలోపు ఓ నాలుగు ఇడ్లీలు విస్తరాకులో పెట్టి ఆయనకిచ్చి శివకి ఇమ్మనేవాళ్ళం.ఒక్కోసారి మా టైం బావుంటే అయన పిలిచినా వినిపించుకోకుండా ఇంటికి పరిగెత్తే వాళ్ళం.
ఇంటికి రాగానే పెరటి అరుగు మీద కూర్చుని విస్తరాకులో ఇడ్లీ, దాని పక్కన కారపు చట్నీపెట్టుకుని ప్రారంభించే వాళ్ళం.మొదటి ఇడ్లీ ముక్క - నోట్టో పెట్టుకోగానే వేడి ఇడ్లీతో చల్లని పచ్చడి కలిసి నాలుక మీద ఒక రుచి, నాట్యం చేసేది. గాలిలో తెలిపోయే వాడిని. రెండవ ముక్క - చేతిలో ఉండగానే నాలుక ఆ రుచి కోసం తహతహలాడుతూ అర అడుగు బయటకి వచ్చి గబాలున లాక్కునేది. అది కరిగిపోయే లోపు త్రిశంకు స్వర్గం దాటేసేవాడిని. మూడవ ముక్క - ఎక్కడ..ఏది .. అప్పుడే గొంతులో - నేను స్వర్గపుటంచులో.
అలా ఆ రుచిని ఆస్వాదించే లోపు ఆకులో అరడజను ఇడ్లీలు, గ్లాసులో సగం చట్నీ అయిపోయేవి. నేనే తిన్నానా నేనెప్పుడు తిన్నాను ..అనుకునేవాడిని. మిగలిన కారం చట్నీని ఆకు మీద వేసి కొంచం కొంచం తింటుంటే ఆహా నా రాజా..  స్వర్గం లో ఇంద్రుడు పక్కన కూర్చుని కత్రీనా, కరీనా, తమన్నా,ఇలియానా రెహమాన్ సంగీతానికి నాట్యం చేస్తుంటే చూస్తున్నట్టు ఉండేది.
సూరయ్యా!.. ఈ కారం చట్నీలో ఏం కలిపావయ్య.. కుబేరుడి భార్య ఆడిన కారమా, ఇంద్రుడి ఇంట్లో వాడిన పచ్చిమిర్చా, వరుణుడు వేయించిన పోపా అని సూరయ్య మీద కారం చట్నీ కీర్తన ఒకటి పాడాలనిపించేది. నా సాహిత్యం చూసి, గొంతు విని మా ఊళ్ళో వాళ్ళంతా ఉప్పరి  డాక్టరుకి  పేషంట్లు అయిపోతారని ఆగిపోయాను.
ఇలా రోజూ ప్లేట్ ఇడ్లీ తో సీప్ గా స్వర్గానికి వెళ్ళే దారి తెలిసాక వదిలి పెట్టలేక పోయాను.చద్దనం లో ఆవకాయా, కారం చట్నీ తో ఇడ్లీనా  అంటే తేల్చుకోవడం కొంచం కష్టం అయినా ఎక్కువగా ఇడ్లీ చట్నీకే వోటు పడేది.
"అమ్మమ్మ శుభ్రంగా మడి కట్టుకుని రోట్లో పిండి రుబ్బి వేడి వేడి ఇడ్లీలు, కమ్మగా చట్నీ చేసి పెడితే ఎక్కదు మనకి. అక్కడ సూరయ్య వారం నుండీ పులిసిపోయిన పిండిని... ఏమేం పిండులు కలిసాయో.. ఏమేం చేతులు పడ్డాయో ... ఇడ్లీ వేస్తే నాక్కుంటూ తింటారు." అని మావయ్య, అమ్మ ఇడ్లీ తెచ్చినప్పుడల్లా అష్టోత్తరం చదివేవాళ్ళు. ఆ రుచి వీళ్ళకేం తెలుసు అని మనసులో నవ్వుకుని, మర్నాడు ఎప్పుడు తెరుస్తాడా సూరయ్య హోటల్.. ఎప్పుడెప్పుడా కారం చట్నీ .... అని ఆలోచిస్తూ ఉండేవాడిని

Thursday, January 28, 2010

పరిమళం

1.
రాలినవి విరులు
సవరించుకుంటే తరులు
సెలయేటి ముకురాల తమ కురులు


రాలిన ఆ విరులు
చుంబించి సెలయేటి అలలు
రేపాయి ప్రేమ ఆవిరులు
పొంగాయి మత్తు అత్తరులు


చల్ల గాలి బోయీలు
పండుటాకు పల్లకీలో
మోసుకెళ్ళాయి ఆ అత్తరులు
మురిసిపోయాయి అత్తరులు

2.
చినుకు నేలని తట్టింది
ఆకాశం ముద్దుపెట్టింది
ఆ స్పర్శకి చెమట పట్టింది
ఆ స్వేదం లో ఏమి సుగంధం

3.
శిశిరమంతా నగ్నంగా
నిలుచున్నది దీనంగా
వీధి చివర ఒంటరి చెట్టు
వసంతం వస్తుందని
పచ్చటాకుల కొత్త కోకను తెస్తుందని.
తనకి కొత్త కోక వాసనంటే భలే ఇష్టం.

Tuesday, January 26, 2010

నేను హిందువుని కానీ పిరికివాడిని

నేను హిందువుని. అలా చెప్పుకోడానికే సిగ్గు పడుతూ ఉంటాను, ఎందుకంటే ఈ మధ్య మతమంటే బూతు మాట ఐపోయింది.  


నేను హిందువుని. పరమ దైవ భక్తుడిని. కానీ పిరికి వాడిని. దేవుడిని గాడంగా నమ్ముతాను. నేనుండే ప్రదేశం లో , రాష్టం లో వీలయితే దేశంలో నా దేవుడిని కొలుచు కోడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చి అయినా వెళ్తాను.ప్రతీ పండగకి గుడికి వెళ్తాను. ఉగాది నించి సంక్రాంతి దాకా ఏది వదిలిపెట్టను. రోజూ పూజ చేస్తాను. గుళ్ళకి విరాళాలు ఇస్తాను. భక్తి కార్యక్రమాలని శ్రద్ధగా వీలైనన్ని చూస్తాను. నాకు బోలెడు భక్తీ. నా దేవుడంటే యనలేని విశ్వాసం. కానీ ఎవడన్నా నా నమ్మకం మీద దెబ్బకొడుతూ పిచ్చి రాతలు రాస్తే మాత్రం చేతికానివడిలా నోరుమూసుకుని కూర్చుంటాను. నా మతం పరమ పవిత్రంగా చూసుకునే గ్రంథాన్ని అవహేళన చేస్తే నేను మౌన ప్రేక్షకుడిలా ఉండిపోతా. నా సిగ్గుమాలిన తనాన్ని రచయిత భావ స్వేచ్చ అని సరిపెట్టుకుంటాను. సాహిత్య అకాడెమి అవార్డులిచ్చి సత్కరించుకుంటాను. సన్మాన సభలు చేసి ఆకాశానికి ఎత్తేస్తాను.


నేను రోజూ పూజించే దేవతలను నగ్నంగా, అసభ్యకరంగా చిత్రాలు గీస్తే, సెక్యూలరిజం ముసుగు లో నా చేతకాని తనాన్ని దాచుకుంటాను. ఇంకా ఇలాటివి బోలెడు గియ్యాలని ప్రోత్సహిస్తాను. వీలయితే భారత రత్న ఇచ్చి సత్కరించుకుంటా. గుండెలు రగిలిపోయినా ఎవరినీ ప్రతిఘటించను. నా దేవుడిని ఎవడన్నా తూలనాడినా నేను ఎదిరించను. నా రాముడిని ఏ కాలేజీ లో చదివాడని హేళన చేస్తే నేను మౌనంగా బాధ పడ్డానే కానీ ఎవరినన్నా ఎదిరించానా. ఎందుకు? అలా చేస్తే నన్ను మతోన్మాది అంటారని భయం. ఎందుకంటే నా మతం వరకు (కేవలం నా మతం వరకే వర్తిస్తుంది) మతాన్ని కాపాడుకోవడం కేవలం కాపాడుకోవడమే మిగతా వారికి .. కాదు కాదు నా మతం వారికే మతోన్మాదం లాగ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మేధావులు వేల సంవత్సరాల నా మత చరిత్ర అంతా అవపోసన పట్టారు మరి. పుక్కిలించేసారు. వేదాలను ఆమూలాగ్రం చదివి జాతికి ఉపయోగపడే బోలెడు సంపదను చేకూర్చిన మేధావులు, పరమాచార్యులు పామరులని తేల్చేసారు. నా మత గ్రంథాలు పుక్కిట పురాణాలని సెలవిచ్చ్చారు. అయినా నేను ఏం మాట్లాడగలిగాను.
మీడియా లో నా మతాన్ని వెక్కిరిస్తూ, అవహేళన చేస్తూ రాతలు రాసినా, మాట్లాడినా నేను పట్టించుకోను .. కాదు పట్టించుకోనట్టు నటిస్తాను. నోటికొచ్చినట్టు నా మతం గురించి మాట్లాడితే కళ్ళప్పగించి చదువుతాను, గుడ్లప్పగించి చూస్తాను. కానీ నోరువిప్పి మాట్లాడను. అన్యాయమని చెప్పను. రోడ్డు మీద ...ఉహు.. కనీసం నా ఇంటి ముందు కూడా నా నిరసన వ్యక్తం చెయ్యను.
అంతర్జాలం లో నేను నమ్మిన దేవుళ్ళను, పురాణాలను హేళన చేస్తుంటే గుండె చివుక్కుమన్నా, కట్టెలు తెంచుకునే కోపం వచ్చినా, భరించలేని బాధ కలిగినా నేను బయట పడను. స్త్రీ వాదం, సామ్య వాదం, హేతు వాదం పేరుతో నా నోరేక్కడ నోక్కేస్తారో, నన్ను తిరోగమన వాది, ఛాందసవాది అని ఎక్కడ ముద్ర వేస్తారో అని. పురాణాల్లో ఏదో ఒక చిన్న వాక్యం తీసుకుని, వక్రీకరించి నా మత గ్రంథాల నెక్కడ తూలనాడుతారో అని నేను మాట్లాడను. ఆ సందర్భానికి,యుగకాల మాన పరిస్థితుల దృష్ట్యా దాన్ని అర్థం చేసుకోవాలి, పోనీ అది ఇబ్బందికరమైతే కనీసం ఈ మేధావులు దానిలో ఉన్న మంచిని తీసుకోవచ్చు కదా అని నా మనసు గగ్గోలు పెడుతుంది. అయినా నేను దాన్ని గొంతు నోక్కేస్తాను. ఎందుకంటే నేను దేవుడున్నాడు, ఇవి పుక్కిట పురాణాలు కాదు అని ఆధారాలు చూపలేక కాదు. శ్రీ కృష్ణుడు ఉన్నాడని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా నిర్దారించారు. అంత మాత్రాన నేను వీరితో వాదించ గలిగానా. అయినా అది అనుభావించాలి నమ్మించ లేము.నమ్మించడం నా పనీ కాదు ఉద్దేశ్యం కాదు. నేను నా మతాన్ని కూడా ఎవడి మీదకీ రుద్దట్లేదు. కానీ నా మతాన్ని కించపరిచే అధికారం, నా sensitivities ని దెబ్బతీసే అధికారం వీరికి ఎవరిచ్చారు. ఈ స్వేచ్చ వీరికి ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించాలని ఉంటుంది. కానీ నాది ఒంటరి గొంతు అయిపోతుందేమో అని భయం.అందుకే మౌనంగా బాధ పడతాను.

కనీసం నా అభ్యంతరం తెలియచేద్దమన్నా భయమే. ఏకాకి నైపోతానేమో అని. అందుకే నిశ్శబ్దంగా బాధ పడతా. ఎవరన్నా ఒక్కడయినా గొంతెత్తి దీన్ని ఖండిస్తాడేమో అని వేచి చూస్తా. రోజూ అలాటి వాడు ఒక్కడైనా ఉంటాడేమో అని వెతుకుతూ ఉంటా . అలాటి వాడు కనపడగానే సంబర పడతా కానీ అది కూడా మౌనంగానే, పబ్లిక్ గా సంతోషం వ్యక్తం చేస్తే so called intellectual society నన్ను ఎక్కడ వెలి వేస్తుందో, నా మీద ఏం ముద్ర వేస్తుందో అని భయం .
కొన్ని దేశాల లో ఐతే వాళ్ల మత విశ్వాసాలని , నమ్మకాలని దాడి చేస్తే ఖండిస్తారు, శిక్షిస్తారు కొందరైతే ఉరి తీస్తారు అని విన్నాను, చదివాను. ఎందుకంటే వారి మతం కాపాడుకోవడం వాళ్ళకి గౌరవం గా భావిస్తారు. మతం మీద దాడి తమ మీద దాడి గా భావిస్తారు. కానీ నా మతం అభిమతం వేరు. ఎవరన్నా దాడి చేస్తే వారిని మేధావులుగా గుర్తిస్తారు ఆకాశానికి ఎత్తేస్తారు, అవార్డులు ఇస్తారు. ఏమన్నా అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటారు. నాకు పెద్దగా లోక జ్ఞానం లేదు కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్చ అంటే ఇంకోడి మతం మీద నోటి కొచ్చినది రాయడమా,చేతికోచ్చినది గీయడమా అని ప్రశించాలని ఉంటుంది. కానీ భయం.. కాదు అసమర్థత.


తన వ్యాసం లో ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు (ఎమ్. ఎఫ్ హుస్సేన్ గారి బొమ్మలు నుద్దేశించి) మా దేవుళ్ళ చిత్రాలు ఇలా వేయడం సబబా? కొన్ని కోట్లమంది sensitivities ని దెబ్బకొట్టిన మీకు ముఖం చెల్లడంలేదంటే తప్పా? మా లక్ష్మీ దేవి, సరస్వతి మీ అమ్మపాటి మర్యాదకి నోచుకోలేదా?’అని ఆ సాయిబుగారి ఒక్క వెంట్రుకయినా పీకరేం?....................... ఏం దరిద్రం పట్టింది మన స్వాభిమానానికి? Intellectual hypocrisy is taken for granted as permissiveness to bigotry- in this country. నేను తెలుగు దేశంలో లేనందుకు ఇన్నాళ్ళూ ఆనందించాను. ఇప్పుడిప్పుడు ఇంకా భారత దేశంలో ఉండక తప్పనందుకు విచారిస్తున్నాను." అని వాపోయారు.
నా దేశంలో అన్ని మతాలూ సమానమే. కానీ నాది తప్ప మిగతావి కొంచం ఎక్కువ సమానం. అది అన్యాయం అనిపించినా సరే. నా దేవుళ్ళని, దేవతలని అవమానించి అయినా సరే , నా మతాన్ని పణంగా పెట్టయినా సరే కళాకారుల భావ స్వేచ్చ, సో కాల్డ్ మేధావుల వాక్స్వాతంత్ర్యాన్ని మాత్రం కాపాడాలి. ఇది అన్యాయం అని ప్రతిఘటించే శక్తి ఎప్పుడో కోల్పోయా, నా స్వాభిమానాన్ని ఎప్పుడో తాకట్టు పెట్టేసా, ఇప్పుడు కేవలం మౌనంగా బాధ పడడమే. అది కూడా తగ్గిపోతోంది. మెల్లాగా వీటన్నిటికీ అలవాటు పడిపోతున్నాను. కొన్నాళ్ళయితే నా మతం కూడా మర్చిపోతానేమో.ఒక్కోసారి అదే మంచిదేమో అనిపిస్తుంది . అప్పుడు ఏ గొడవా ఉండదు. ఈ బాధ, నిస్సాహాయత కూడా ఉండవు.
గమనిక  - వ్యాఖ్యలు చేసేటప్పుడు బ్లాగర్లు తమ విజ్ఞ్యత ప్రదర్శించమని  మనవి. విపరీత వ్యాఖ్యలు , అభ్యంతరకరంగా ఉన్నవి ప్రచురించబడవని  మీకు తెలుసనీ, తదనుగుణంగా  వ్యాఖ్యలు చేస్తారని ఆశిస్తున్నాను. 

Thursday, January 21, 2010

సుజనరంజని (సిలికాన్ ఆంధ్రా) లో నా కవిత

సిలికాన్ ఆంధ్ర వారి అంతర్జాల మాస పత్రిక సుజనరంజని లో నా కవిత ప్రచురిత మయ్యింది. ఈ దిగువ లంకె లో చూడచ్చు.

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec2009/kavita-4.html