Saturday, May 21, 2011

ఎవడో గోదారి మీద లాంచీ లో భద్రాచలం వెళ్ళచ్చన్నాడు.. వాడిని !#%^^!@%& - రెండవ భాగం


మొదటి భాగం - ఇక్కడ  

నిడదవోలు - చాగల్లు - పట్టిసీమ - పాపి కొండలు - పోచవరం మీదుగా జీడికుప్ప చేరుకున్నాం.

జీడికుప్ప నించీ ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా  ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్  వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది.   అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెల్లో విమానాలు పరిగెత్తించాడు.

ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా భ్రమేమో, చెప్తే నవ్వుతారని  ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..

అందరూ నన్ను వింతగా చూసారు. "పైన ఎవడో ఉన్నాడు రా ఖచ్చితంగా. నా నెత్తి  మీద ఎగిరి పడ్డాడు. అన్నలేమోరా" అన్నాను.
  
అన్నలకి పనేం లేదా ఆటోమీదకి ఉరికి నిన్ను పట్టుకోడానికి నువ్వేమన్నా రాజకీయ నాయకుడివా, కనీసం వీధి రౌడీవి కూడా కావు అని రియాక్షన్.

నాకు ఒళ్ళు మండింది. పుండు మీద కారం జల్లినట్టు ఆటో డ్రైవర్ పకపకా నవ్వుతున్నాడు. వీడికి ఓంకార్ షో లు రోజంతా చూపించినా పాపం లేదన్నంత కోపం వచ్చింది. వాడు నవ్వాపి, తోడుకని ఇంకో పిల్లాడిని తెచ్చుకున్నానని, ఆటోలో చోటు లేదని పైనే కూర్చోపెట్టానని చెప్పాడు.  

నేను సీరియస్ గా వెళ్లి ఏమీ జరగనట్టు ఆటో లో కూర్చున్నా. మిగత వాళ్ళంతా కామెడీ గా వచ్చి కూర్చున్నారు.
డ్రైవర్ గేర్ రాడ్ వెనక్కి లాగాడు. ఆటో ముందు కెళ్ళింది. చిమ్మ చీకటిలో చిన్న కాంతి లో దారిని చూస్తుంటే, మా పరిస్తితికి సింబాలిక్ గా ఉన్నట్టనిపించింది. ఈ ఆటో దొరకకపోతే ... తలుచుకుంటేనే భయం వేసింది.

ఇలా ఒక గంట ఆటో అడవిలో, నేను ఆలోచనల్లో ప్రయాణించాక కూనవరం రానే వచ్చింది.  కాకపోతే అర్థరాత్రి అయ్యింది. ఊహించి నట్టే ఆఖరి బస్సు కూడా వెళ్లి పోయింది.  అక్కడ తినడానికే హోటల్స్ లేవు. ఇక ఉండడానికి ఏముంటాయి. ఏదైతేనేఁ అడివి నించి ఊర్లోకి వచ్చాం. ఆటో డ్రైవర్ కి బోలేడ్ థాంక్సులు చెప్పి, డబ్బిచ్చి పంపేశాం.
భద్రాచలానికి ఇంకో వాహనం కోసం ప్రయత్నం మొదలెట్టాం.


ఆటో స్టాండ్ లో సగం మంది బళ్ళు ఆపేసి, కల్లు తాగేసి తూలుతున్నారు. మిగతా సగానికి బళ్ళు లేవు. ఎవరో ఒకతను తనకు ఆటో డ్రైవర్ ఒకడు తెలుసనీ ఊర్లోకి తీసుకెళ్తానన్నాడు. నేను నా స్నేహితుడు కిరణ్ వాడిని ఫాలో అయ్యాం. అయిదు, పది , పదిహేను , ఇరవై (మగధీర లో శ్రీహరి లా లెక్కెట్టుకోండి) నిమిషాలు నడుస్తూనే ఉన్నాం. ఇంకొంచం ముందుకు ఇల్లు అని తీసుకెళ్తూనే  ఉన్నాడు .  ఆయాసం, అసహనం వస్తున్నాయి కానీ ఇల్లు రాలేదు. ఈ లోపు వాడు ఇంకా ఇంకా ముందుకు పోదాం అంటూ పోయాడు. మాయమైపోయాడు. హ్యాండ్ ఇచ్చాడని డిసైడ్ అయ్యి ఉసూరు మంటూ వెనక్కి బయల్దేరాం.

ఆటో స్టాండ్ కి వచ్చేసరికి నా స్నేహితులు ఒకడితో బేరం కుదిర్చారు. రెండు వందలు కాబోలు. ఆ డ్రైవర్ చూస్తే కొంచం తూలుతూ ఉన్నాడు. వీడిని నమ్ముకుంటే మనల్ని ముందుకు కాదు పైకి పంపించే డట్టు ఉన్నాడని డిసైడ్ అయ్యి, వద్దని చెప్పేసాం. ఈ లోపు ఆ పక్కన వైన్ షాపు లో లోడ్ దించుతున్న మినీ ట్రక్ డ్రైవర్ మా పాలిట రాముడిలా వచ్చి, లోడ్ దించాక భద్రాచలం వెళ్తానని చెప్పాడు. పది నిమిషాలు ఆగితే మమ్మల్ని తీసుకెళ్తా నని హామీ ఇచ్చాడు .

ఇది విన్న తాగున్న ఆటో డ్రైవర్ కళ్ళు తాగిన కోతిలా గంతులేసి గొడవకి దిగాడు.  సారా ఆటో క్లబ్ అంతా వాడికి వత్తాసు పలికింది. ఏదో కొంచం సేపు వాదించినా, అందరం పోకిరీలం కాదు కదా , బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్లమి. కనుక బేరం ఆడిన మొత్తం వాడికి సమర్పించుకున్నాం. దిగాక ఇచ్చే ఆటో డబ్బులు ఎక్కకుండానే ఇచ్చాం ( పోను పోను ఇదే పద్ధతి జిం లో అలవాటయ్యింది. నెలకోసారి కూడా ట్రెడ్మిల్ ఎక్కకపోయినా నెల నెలా చందా మాత్రం కడతాను)

ఆటోవాడిని వదిలించుకుని వైన్ షాప్ లోడింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాం. పది నిమిషాలు  అన్నది గంటకి పైగా పట్టింది. ఇంత చీకాకు లోనూ షాప పేరు చూసి నవ్వొచ్చింది - గాంధీ వైన్స్. ముందు మహాత్మా పెట్టకుండా  మేలు చేశాడనుకున్నాం.

వైన్ షాప్ పనవ్వగానే (వాడికి), అందరం లగేజీ తో ఆ చిన్నట్రక్ లో ఎలాగో ఇరుకున్నాం. పవిత్రంగా సారా బండిలో భద్రాచలం బయల్దేరాం. అర్థరాత్రి లో అడవి ప్రాంతం లో చిక్కటి చీకటిలో చక్కటి చుక్కల్ని చూస్తూ  కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు (నిద్రలేక), మందు కంపు, వంటికి గుచ్చుకుంటున్న విరిగిన సీసాముక్కలు అన్నీ మరిచిపోయాం.
గంటలో భద్రాచలం చేరాం. గుడ్డిలో మెల్ల హోటల్  ఒక్కటీ ముందే బుక్ చేసుకున్నాం. హోటల్ దగ్గరికి  రాగానే డ్రైవర్ బేరం మొదలెట్టాడు. లిఫ్ట్ అనుకున్నామే అంటే నాకిచ్చే డబ్బు గిఫ్ట్ అనుకోండి అన్నట్టు చూసాడు. అడిగినది ఇచ్చి హోటల్ రూమ్స్ చేరుకున్నాం. ఆ టైం లో కూడా మాకు తినడానికి ఏర్పాటు చేసిన ఆ హోటల్ బాయ్ ని మర్చిపోలేం.

మర్నాడు ఆలస్యంగా వెళ్ళినా దర్శనం బ్రహ్మాండంగా ఐంది.ఈ ప్రయాణం అనుభవం తో హైదరాబాద్ తిరిగి వెళ్ళేటప్పుడు భద్రాచలం నించి ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ టైం కి రెండు గంటలు ముందే స్టేషన్ చేరుకున్నాం ప్రయాణం నేర్పిన పాఠం వల్ల .


ఒక వారం పోయాకా "గోదావరిలో గల్లంతయిన తాతాజీ. గుర్తు తెలియని వ్యక్తుల పని అని అనుమానం" అని  పేపర్ లో పడిందని  నాకు కలొచ్చింది (కాబోలు).



Tuesday, March 22, 2011

అవినీతి లేని భారత దేశాన్ని చూడాలని కోరుకుంటున్నారా ?


ఏమిటి ?

స్వాత్రంత్రం వచ్చి 63 ఏళ్ళు అయినా,  మన దేశం శక్తికి తగ్గ అభివృద్ది జరగలేదు. ఎంత పురోగమించినా  సగటు భారతీయుని ఆదాయం పెద్దగా పెరగలేదు. ఇందుకు అవినీతి ఒక ముఖ్య కారణం. దేశం లో అడగడుగునా అవినీతి ఉందని కాదనలేని సత్యం. రాజకీయ నాయకులలో అధిక శాతం అవినీతి పరులని పసి పిల్లవాడిని అడిగినా చెబుతాడు. అవినీతి అంత సర్వ సాధారణం అయినా , గత రెండు సంవత్సరాలలో ఇది కనీ వినీ ఎరుగని  స్థాయిలో, సంఖ్యలు చూస్తే  కళ్ళు భైర్లు కమ్మే స్థాయిలో పెరిగింది. ఆదర్శ, కామన్ వెల్త్ , 2G  స్కామ్లు  దేశాన్ని  కుదిపేస్తున్నాయి. అవినీతి ఎంతకి  పేరుకుపోయిందంటే, ఆ సొమ్మును మనం విదేశీ బ్యాంకుల నించీ వెనక్కి తీసుకు రాగలిగితే ముప్పై ఏళ్ళు ... అక్షరాలా ముప్పై ఏళ్ళు  పైసా పన్ను లేకుండా దేశం నడవచ్చు అన్న స్థాయిలో. 

ఉపోద్ఘాతం  సరే .. అయితే ఇప్పుడేంటి అంటావ్ ?

ఇది భరించలేని కొందరు ఇలా చూస్తూ ఊరుకోవడం సరి కాదని నడుం బిగించారు. గళం వినిపించారు. విద్యాధికులు, న్యాయ మూర్తులు తదితరులు తయారుచేసిన జన్ లోక్ పాల్ బిల్ ను  పార్లమెంట్  లో ప్రవేశ పేట్టే వరకూ India against Corruption ఉద్యమం చేపట్టారు.  అదే సమయం లో భారత దేశం లో  అవినీతి కి విసుగెత్తిన ప్రవాస భారతీయులు కొందరు   "దేశం ఇంతే దీన్ని బాగుచెయ్యడం ఎవరి  వల్లా  కాదు" అని  కూర్చోకుండా  ఒక ఉద్యమం చేపట్టారు. Jan Lokpal Bill అమలు చెయ్యడం ప్రధమ లక్ష్యంగా,  అవినీతి వ్యతిరేక పోరాటాన్ని జనాలలోకి తీసుకెళ్ళే దిశగా ఒక  బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  






ఏంటది ? 

అదే రెండవ దండి పాదయాత్ర (Dandi March 2).  

అప్పుడు:

గాంధీజీ చేసిన దండి పాదయాత్ర 1930 మర్చి 12న సబర్మతి ఆశ్రమం దగ్గర మొదలై దండి వరకూ 24 రోజులపాటు 240 మైళ్ళు సాగింది ఆ పాదయాత్ర.. దేశ స్వాతంత్ర్య పోరాటం లో ఇదొక కీలకమైన మలుపు. 

ఇప్పుడు:

అదే స్ఫూర్తి తో, అవే తేదీలలో  అంటే  మర్చి 12 న మొదలై మర్చి 26 వరకు దక్షిన కాలిఫోర్నియా లోని శాన్ డియాగో లో  మార్టిన్ లూదర్ కింగ్ విగ్రహం దగ్గర మొదలై  అక్షరాల 24 రోజుల పాటు కాలిఫోర్నియా లో ప్రముఖ పట్టణాలలో సాగి 26న శాన్ ఫ్రాన్సిస్కో లోని గాంధీ విగ్రహం దగ్గర ముగుస్తుంది. అదే రోజున ప్రపంచం నలు మూలలలో  వివిధ పట్టణాలలో భారతీయులు ఈ పాద  యాత్రకి సంఘీ భావంగా పాదయాత్రలు చేస్తున్నారు.



ఈ  రెండవ దండి యాత్రలో   ఆరుగురు ప్రవాసులు మొత్తం నుండి చివరి దాకా అంటే 24 రోజులూ, 240 మైళ్ళూ  నడుస్తునారు. వారు జవహర్ కంబంపాటి , శ్రీహరి అట్లూరి, సుభాష్ కర్రి, 
వర్మ దంతులూరి, కేవల్ పర్నామి, శ్రీనివాసరావు నందివాడ (కింద ఫోటోలో చూడవచ్చు)  . 
వీరు ఉద్యోగాలకి శెలవు పెట్టి, కేవలం అవినీతిని ప్రతిఘటించడానికి, జనాలలో జన్ లోక్ పాల్ బిల్ (Jan Lokpal Bill) వస్తే కానీ దీనికి అంతం లేదనే అవగాహన పెంపొందించడానికి, ఆలోచన రేకెత్తించడానికి , నిజానికి దేశం లో అవినీతి అంతమొందాలి  అనుకునే ప్రతీ ఒక్కరి గురించి నిస్వార్థంగా నడుస్తున్నారు. కేవల్ పర్నామి గారి వయస్సు 70  ఏళ్ళు అని వినగానే ఆశ్చర్యం, ఆయనంటే గౌరవం కలగక మానదు.









సరే!... అయితే??....:



దేశం లో అవినీతి పోవాలి, కనీసం ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి, దేశాన్ని తిట్టుకుంటే సరిపోదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకునే వాళ్ళందరూ జన్ లోక్ పాల్ బిల్ అమలు చేయడం ఒక గొప్ప పరిష్కారం అని గుర్తించాలి.

"నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోస్తానూ " అంటూ ముందుకు  రావాలి. 

మీ గొంతు వినిపించాలి. మీ వంతు కృషి చెయ్యాలి.

రెండవ దండి పాదయాత్ర (Dandi March2)  ప్రయత్నం మీకు నచ్చితే, మీ భావాలకి దగ్గరగా ఉంటే   మీ సహకారం, మీ సంఘీభావం తెలపండి. ఈ  పాదయాత్రలో  మొత్తం 240 మైళ్ళూ  నడవడానికి పూనుకున్న ఆరుగురు ఎండనకా వాననకా రెండు వారాలగా నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కువగా జనాలు సపోర్ట్  చేస్తే ఈ ప్రయత్నం జనం లోకి వెళ్తోంది అన్న  ఆనందం తో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ఉపకరిస్తుందని గమనించండి.

అందుకని కాలిఫోర్నియా లో ఉన్నవారైతే మీ శక్తి కొలదీ 1,2,3,5,.. మైళ్ళు   వీరితో కలిసి నడవండి. వీలు కాకపోతే మీ పట్టణం లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళని పలకరించి మీ సపోర్ట్ తెలపండి.   అదీ వీలుకాకపోతే 26 న మీ పట్టణం లో జరిగే సమావేశం లో పాల్గొనండి. 






అది కూడా వీలుకాకపోతే ఇలాటి వాటిలో ఆసక్తి ఉన్న మిత్రులకి తెలియజేయండి. 

అది కూడా వీలుకాకపోతే.. ఇదంతా ఒక వెర్రి వాడి బాధని వదిలెయ్యండి.   అనవసరంగా చదివామనుకొని ఊరుకోండి . 
దేశం ఇంతే అని నిట్టూర్చి హాయిగా నిదరపొండి. శ్రీశ్రీ అన్నట్టు "... ప్రపంచం ఎట్లా పొతేనేఁ మీకెందుకు లెండి ... అదృష్ట వంతులు మీరు వడ్డించిన విస్తరులు మీ జీవితం." 



గమనిక
1.  ఆలోచన లోక్ సత్తా కార్య కర్తల దైనా, ఇందులో పార్టీలకి సంబంధం లేకుండా ఎవరన్నా పాలుపంచుకోవచ్చు. చాలా సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతుగా నడుస్తున్నాయి, సహకరిస్తునాయి.   
2. రాజకీయ నాయకుల అవినీతి గురించి మాట్లాడుతున్నాం కానీ, మనం లంచాలని ఇవ్వట్లేదా, తీసుకోవట్లేదా అనేది చొప్పదంటు ప్రశ్న కాకపోయినా (ఈ మీమాంస లోనే ఇన్నాళ్ళు దీని గురించి రాయలేదు )  ఈ వ్యాస పరిమితి మించిన ప్రశ్న అని నా ఉద్దేశ్యం. లంచం ఇవ్వడం తీసుకోవడం తప్పే కానీ  తప్పక, గత్యంతరం లేక  ఇస్తున్నవారే ఎక్కువ.  ఇప్పుడు కోరుకునే మార్పు ఆ అవకాశం లేని సమాజం ఏర్పరిచే దిశగా వెళ్తుందనే పాజిటివ్ ఆలోచనతోనే రాయదలచుకున్నాను.  

చివరిగా ఇందులో చరిత్ర పరంగా కానీ ఫాక్ట్స్ కానీ ఏమన్నా తప్పులుంటే చెప్పగలరు. సరి చేసుకుంటాను  



Sunday, March 20, 2011

ఎవడో రాజమండ్రి - భద్రాచలం లాంచీ లో వెళ్ళచ్చన్నాడు.. వాడిని !#%^^!@%& - మొదటి భాగం


"వారిని! ఇవేనా అలిపి బ్యాక్ వాటర్స్ అంటే. మా అయినాపురం లో మురిక్కాలువ అంత ఉంది దీని  వెడల్పు  . దీనికి పదకొండు వేలు, పెద్ద హడావుడి. కోనసీమ లో ఇలాటి బోట్లు  పెడితేనా "God's own county" అనేస్తార" న్నాను  

"అయితే ఈసారి తీసుకెళ్ళరా. మేమూ చాలా విన్నాం"

"సరే ఐతే ఈసారి అక్కడికే. మీరు కోనసీమ చూడలేదు. నేను పాపి కొండలు చూడలేదు. ఒకే ట్రిప్పుకి రెండు ... "

"సర్లే. ట్రై చేసింది చాలు. ఈ సారి సరిగ్గా ప్లాన్ చెయ్యి. " చిరాగ్గా సెలవిచ్చాడు కిరణ్.

ఆ కేరళ ట్రిప్ ఐపోయాకా,లీవ్ తీసుకున్న నేరానికి నాకు ఆర్నెల్లు కఠిన క్యూబికల్ శిక్ష పడి పనిలో మునిగి తేలి, యత్రాలంటే భయం, లీవంటే  వణుకు పట్టుకున్నాయి.

శిక్షా కాలం ముగిసాకా ఒకనాడు స్నేహితులతో  కలిసి అనుకోకుండా గోదావరి సినిమాకి వెళ్లాను.

కట్ చెయ్యకుండానే ... నెలలో ఒక లాంచీ యజమాని కాంటాక్ట్ దొరకడం అతను మమ్మల్ని బ్రహ్మి (సా. ఇ ) అని తెలిసి వాయించి వదలడం, రాజమండ్రి నించి భద్రాచలం కి లాంచీ కుదరడం  చక చకా జరిగి  పోయాయి.

                          
                  **********************************************


రెండు వారాల తరువాత...

మా ప్రయాణం రోజు రానే వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్ లో మేము ఏడుగురం స్నేహితులం కలుసుకున్నాం.

గౌతమీకీ గార్డ్ సిగ్నల్  ఇచ్చాడు. రైలు  బయల్దేరింది.

కానీ ముందు ఏదో జరగబోతోంది అన్నట్టు ట్రైన్ స్లో మోషన్ లో కదలలేదు, ఆకాశం మేఘావృతం కాలేదు, మెరుపులు మెరవలేదు, ఉరుములు ఉరమలేదు. ప్రకృతి బొత్తిగా ఏ క్లూ ఇవ్వలేదు.

మర్నాటి ఉదయం  మాలతి గారి ఊరిలో దిగాం. అదేనండీ నిడదవోలు.

అక్కడికి మా పెదనాన్న పంపిన సూమో ( ఈ మాట వినగానే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనేసుకోవడమే. ఇది కోనసీమ. రాయలసీమ కాదు.) ఎక్కి అరగంట లో చాగల్లు చేరుకున్నాం. ఈ ఊరు షుగర్ ఫ్యాక్టరీ కి ప్రసిద్ది మా అమ్మమ్మ వాళ్ళ వంశం లాగా. సీజన్ అనుకుంటా ఎక్కడ చూసినా చెరుకు కనపడుతోంది.
ఇంటికి చేరగానే మా గ్యాంగ్కి  ఇంటి టూర్ ఇచ్చి, కాఫీలిచ్చి, టిపినీలు పెట్టింది మా దొడ్డమ్మ. వేడి వేడి పెసరట్టుని  ఉప్మా తో ఒక పట్టు పట్టాం  అందరం. బుద్ధిగా స్నానం చేసి, శ్రద్ధగా దండం పెట్టుకుని పట్టి సీమకి  బయల్దేరాం.

ఆ రోజు ప్రయాణం ...పట్టి సీమ, గోదావరి మీద లాంచీ, పాపి కొండలు, భద్రాచలం.. తలుచుకుంటే కడుపు నిండి ఆ తిండి ఆకర్లేదని పించింది.

పట్టిసీమ ఇవతల ఒడ్డుకి చేరుకున్నాం. అక్కడే మా లాంచీ, దాని యజమాని/మా టూర్ గైడ్ తాతాజీ కనిపించాడు.    దగ్గరలో ఉన్న  ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి  దండం పెట్టించి, లాంచీ ఎక్కించాడు (ఇందులో మతలబు బోధపడలేదు అప్పుడు ).  ఈ లాంచీ మొత్తం మీ కోసం, ఎవరిని ఎక్కించం, ఇందులో మీకు అన్నీ రెడీ - కాఫీలు, టిపినీలు, భోజనం అని చెప్పుకొచ్చాడు. మేము అనుకున్నంత కాకపోయినా బానే ఉందనిపించింది. ఫోటోలు తీసుకున్నాకా, లాంచీ రయ్యంది, అయిదు నిమిషాలలో అవతలి ఒడ్డున ఉన్న పట్టి సీమకి  చేరుకున్నాం. ఆ ఇసుక తెన్నెల్లో దిగగానే శంకరభరణం, వంశీ సినిమాలు గుర్తొచ్చాయి.  అద్భుతంగా ఉంది, గోదారి వడిలో, నీటి చప్పుడులో, సేద తీరడానికి భలే స్పాట్ సెలెక్ట్ చేసుకున్నావు కదయ్యా వీరేశ్వరా అనుకున్నాను.  

దర్శనం చేసుకుని లాంచీ చేరుకున్నాం. వాడిచ్చాడు కదా అని టిపినీ కొంచం టేస్ట్  చేసి లాంచీ పైకెక్కి  సై అన్నాం. క్లీనర్ రై రై అన్నాడు. లాంచీ నీటి తెరలను చీల్చుకుంటూ ముందు కెళ్ళింది. సూత్రధారులు సినిమాలో సత్య నారాయణ లాగా కూర్చిలో కూర్చుని గోదావరిని చూస్తూ కూర్చున్నాం. చూడడానికి ఇంకో రెండు కళ్లుంటే బావుండనిపిచింది. కొంత సేపయ్యాక కిందకు దిగి, లాంచీ వంచ మీద  కాళ్ళు నీళ్ళల్లో పెట్టి కూర్చుంటే, ఆ వడికి, నీటి తుంపరలు ఎగిరి పడుతుంటే, చల్లని ఏటి గాలి తడుతుంటే స్వర్గం దీనికి దిగదుడుపేమో  అనిపించింది.


ఆ హాయిలో గంటలు నిమిషాలు లా గడిచిపోయాయి. సుమారు ఒంటి గంటకి పాపి కొండల దర్శనం ఐంది.  "అల పాపి కొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా" అని వేటూరి చెప్పినట్టు, గోదారి నవ్వుతున్నంత ఆహ్లాదంగా ఉంటుంది, ఆ కొండలను కడుగుతునట్టే ఉంటుంది. చాలా సేపు చూడనిచ్చాక తాతాజీ లాంచీ ని  ఒక తాండా దగ్గర ఆపాడు. అక్కడే మా మధ్యాహ్న భోజన పధకం అన్నమాట. అసల ఒక్క పదార్ధం కూడా తినలేక పోయాము. కొంత సేపు ఆ వ్యూ పాయింట్ నించీ గోదారిని తనివి తీరా చూసి బయల్దేరాం.



గోదావరి లో నీరు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల, భద్రాచలం వరకూ లాంచీ వెళ్ళదని చావు కబురు చల్లగా సెలవిచ్చాడు తాతాజీ. అందువల్ల మా ప్రయాణానికి చిన్న మార్పులు చేర్పులూ చేసి మమ్మల్ని పోచవరం లో దింపుతా  అన్నాడు.  అక్కడి నించీ బస్సు పట్టుకుంటే కూనవరం, అక్కడ ఇంకో  బస్సు పట్టుకుంటే భద్రాచలం.
ఓస్ ఇంతేగా అనుకున్నా, మా గత ప్రయాణాల అనుభవాల వల్ల ఏదో తేడా కొట్టింది. భారం రాముడి మీద వేసి  బయల్దేరాం.

పోచవరం చేరే సరికి సాయంత్రం ఆరయ్యింది. అదో చిన్న పల్లె. ఒక డజను ఇల్లుంటాయేమో. ఇక్కడికి బస్సు కూడా వస్తుందా అని ఆశ్చర్య పోయాం. కానీ మా ఆశ్చర్యాన్ని పటాపంచలు చేస్తూ మాకు భయం కలిగించే విషయం చెప్పాడు తాతాజీ - ఆఖరి బస్సు మూడింటికే వెళ్ళిపోయిందని. గుండెలో రాయపడినా, తాతాజీ ఏదో మార్గం చూస్తాడులే అని ధైర్యం. ఆటోలు ఎమన్నా ఉన్నాయేమో అని కనుకున్నాడు. ఆటో కాదు కదా కనీసం ద్విచక్ర వాహనం కూడా ఎవరికీ లేదు ఆ పల్లెలో. వాళ్ళనీ వీళ్ళని కనుక్కొని  అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఇంకో ఊరుందని, అక్కడ ఆటో లేమన్నా దొరకచ్చని, లాంచీ లో ఉన్న మా సామాను తీసుకోమని సెలవిచ్చాడు తాతాజీ.
మాకొచ్చిన కోపానికి తాతాజీ ని కాలు కిందేసి తొక్కేయాలని పించింది. కంట్రోల్ చేసుకుని, సమస్య సామరస్యం గా చర్చించి, భద్రాచలానికి ఏదో ఒక వాహనం దొరికే ఊరి వరకూ మాకు తను షెల్టర్ ఇవ్వడానికి, అతనికి మేము  కంపెనీ ఇవ్వడానికీ  ఒప్పందం చేసుకున్నాం.

ఈలోపు మా పరిస్థితికి సింబాలిక్ గా చీకటి పడింది. గోదావరి ఉదయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో రాత్రి అంత భయపెడుతుందని మాకు అప్పుడే తెలిసింది. కనుచూపుమేర జనాలు లేరు. చిక్కటి రాత్రిలో నల్లటి ఆకాశం లో డిమ్ గా వెలుగుతున్న చుక్కల వెలుతురులో బోటు సాగుతోంది, భయం పెరుగుతోంది, గుండె వణుకుతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రా సాగాయి. ఈత రాని మేము నీటిలో పడితే, ఇంధనం లేక పడవ ఆగిపోతే, మమ్మల్ని వీడు ఇక్కడే  వదిలిపోతే.... గోదావరిలో హైదరాబాద్ పిల్లలు గల్లంతు అనే న్యూస్ .. వరకూ వెళ్ళిపోయాయి ఆలోచనలు.

ఈలోపు ఇంకో చిన్న పల్లె వచ్చింది (అనుకున్నాం). తాతాజీ పడవని ఒడ్డు దాకా పోనివ్వడం, టార్చీ లైట్ ఊపడం, అక్కడినించీ ఎవరన్నా సిగ్నల్ ఇస్తారేమో అని. నాకైతే అన్వేషణ సినిమా గుర్తొచ్చింది. ఇలా రెండు మూడు చోట్ల ఆపగా ఒక చోట అటు నించీ సిగ్నల్ వచ్చింది. తాతాజీ, ఇంకో ఇద్దరం వెళ్లి కన్నుక్కోగా, ఆ ఊరు జీడికుప్పని,  ఒకే  ఆటో ఉందని, అక్కడినించీ కూనవరం ఒక గంట పడుతుందని తెలిసింది. చిన్న ఆశ చిగురించింది. ఆరుగురు మంది లగేజీ తో ఆటో లో ఎలా పడతాం అని కూడా ఆలోచించలేదు. తాతాజీ ని ఏం చేసినా పాపం లేదని అనుకుని ఎలాగో సద్దుకున్నాం. ఆ ఆటో వాడు ఒక పిల్లాడిని కూడా తెచ్చుకున్నాడు. తోడుకేమోలె అనుకున్నాం. కానీ  టార్చీ లైట్ పట్టుకోడానికాని   ఆ తరువాత తెలిసింది - ఆ ఆటోకి హెడ్ లైట్ లేదు.

ఆటో బయల్దేరింది. చిమ్మ చీకటిలో, కారడివిలో (అదంతా  ఏజెన్సీ ప్రాంతం), ఆ పిల్లాడు వేస్తున్న టార్చీ లైట్  వెలుగులో, దారి పొడవునా గుంటలు పడిన ఆ రోడ్డు మీద ఆటో సాగిపోతోంది.   అసలే బెదిరి పోయిన మమ్మల్ని ఆ ఆటో వాడు, ఇక్కడ కూంబింగ్ జరుగుతోందని, అన్నలు, పోలీసులు తెగ తిరుగుతున్నారని చెప్పి ఇంకా భయపెట్టాడు. పక్కనే ఉన్న పిల్లాడు దానికి వత్తాసుగా అప్పుడప్పుడు పులులు కూడా వస్తూ ఉంటాయని గుండెలో రైళ్ళు పరిగెత్తించాడు.


ఈ లోపు వెనకన కూర్చున్న నాకు తల మీద, ఆటో పైన ఏదో కదులుతూ ఉన్నట్టనిపించింది. నా బ్రహ్మేమో, చెప్తే నవ్వుతారని  ఏమీ మాట్లాడలేదు. ఇంతలో రోడ్డు మీద ఒక గతుకొచ్చింది. అంతే గబాలున ఎవరో నెత్తి మీదకి ఉరికారు.కెవ్వున కేక వెయ్యబోయి, భయాన్ని గొంతులోకి మింగి, ఆటో ఆపమని అరిచాను. డ్రైవర్ అదో రకం లుక్ ఇచ్చి బ్రేక్ వేసాడు ..



.............. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం.....

రెండవ భాగం  - ఇక్కడ 

Sunday, January 30, 2011

కోతి కొమ్మచ్చి



ఈ సారి నా గొంతు వినిపించ దుస్సాహసం చేస్తున్నాను. నిజానికి వినడానికి మీరు సాహసం చేస్తున్నారంటే కరెష్టేమో.  మీకు డబల్ డోస్ అన్నమాట .



నిన్ననే ఒక మహత్కార్యం చేశాను. కోతి కొమ్మచ్చ్చి ఆడియో కొని వినడం.. కాదు పారాయణం చేయడం మొదలెట్టా. ఆపబుద్ధి కావట్లేదు. ఈ రోజు తో పారాయణం పూర్తవుతుంది. ఇంత అద్భుతమయిన పుస్తకం ఇప్పటి వరకు ఎందుకు చదవలేదా అనుకున్నాను. కానీ బాలు గొంతులో విన్నాక ఒక విధంగా ఇది కూడా మంచిదే అనుకున్నాను. కో. కొ. (పుస్తకం చదివిన వాళ్ళకి తెలుస్తుంది) అనట్టు బాలు అనగానే గుర్తొచ్చింది. మొత్తానికి బాలూ కి పద్మ భూషణ్ వచ్చింది (ఇప్పటికైనా). అనుకున్న్నట్టే ఇది కూడా (పద్మశ్రీ లాగే) తమిళ నాడే తెప్పించింది. సుశీల గారికి కూడా వాళ్ళే. ఇది తలచుకున్నప్పుడు మన ప్రభుత్వాలకి కళలంటే చిన్న చూపెందుకని అనుమానం వచ్చింది. మన వాళ్ళకి డబ్బు చేసిందని ముందనిపించింది. రియల్ ఎస్టేట్ మీద యావ స్టేట్ మీద స్టేట్ లాంగ్వేజ్ మీద లేదని స్నేహితుడొకడు స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. ఇంకా ఆలోచించగా చించగా ఇది ఇప్పటిది కాదని మనకి తరతరాలుగా వస్తున్న అచారమేమో (గ్రహచారమేమో ) అని తోచింది.  కాకతీయులు, శాతవాహనులు వగైరా తెలుగు కవులకి పట్టం కట్టారో లేదో తెలియదు. అది తెలుస్కోవాలో లేదో కూడా తెలియదు. కానీ తెలుగు కవులని నెత్తికెత్తుకుని, తెలుగుకు పట్టం కట్టినదెవరంటే శ్రీ కృష్ణదేవరంటే (ప్రాస బావుందని ) కాదంటారా. మరి ఆ ఆంద్ర భోజుడి మాతృభాష తులు కదా! అంటే అనాదిగా తెలుగు కళాకారులని తెలుగువారికంటే, ఆ అదృష్టం లేని వారే (తెలుగు గా పుట్టడం అదృష్టమన్నానని నను భాషా దురాభిమానుల పంచన కట్టేయ్యకండీ . ముఖ్యంగా ఆ DMK పక్కన . అన్నట్టు ఇది ఒక అసభ్య పదానికి షార్ట్ గా వాడడం రివాజు అని నాకు గుర్తొచ్చినా చెప్పను) తలకెత్తు కుంటున్నారని నొక్కి వక్కానిస్తున్నాను . నాకు చరిత్ర, కళలు గురించి తెలిసినది తక్కువ కనుక, ఎక్కువ మాట్లాడే అధికారం ఉంది కనుక నన్ను ఆం ఆద్మీ గా జమకట్టి నాది మెజారిటీ గొంతుగా ఒప్పుకోండే మరి.
మళ్ళీ అసలు కథ. రమణ గారు వండిన అమృతాన్ని ..అదే ఆయన కష్టాలు-నష్టాలు,కన్నీళ్లు - కడగండ్లు కలిపి ..తయారు చేసిన టానిక్ ని ( కాపీ "రైట్" కనుక ఈ మాటను వాడేస్తున్నాను).. నిజానికి ఇది ఉప్పగా ఉండాలి .. కానీ ఆయన ఆకలి కేకలను జోకులతో కలిపి కొంటె తనపు కిసమిస్స్లను, యధార్థాలనే యాలకులను జల్లి.. అమృతం ఏం ఖర్మ దాని బాబులా తయారుచేసారు. బాలు దాన్ని వెండి పళ్ళెం లో వడ్డించారు. విందారగించాను.. కానీ భుక్తాయాసం రావట్లేదు. ఇంకా ఇంకా అంటూనే ఉంది. ముద్దపడితే మూత పడును కడుపు శాంతించి. తిన్నకొద్దీ ఎంత యావో మనసు కదో పిచ్చి.


కొ.కొ.-- 
అన్నట్టు ఇలాటివి రాయడానికి నాకు చంద్రబోసు గారే  inspiration, expiration, motivation.. ఎందుకంటారా నాకు సిరివెన్నల అన్నా వేటూరి అన్నా భయం (కొంత మంది దీన్ని భక్తీ అని కూడా అంటారు). Stanford professor ని చూసిన Tri valley విద్యార్ధి లాగా. కానీ చంద్రబోసు గారు అలా కాదు. ఆయన పాటంటే (పాటింటే ..) నేను చెవికోసుకుంట. అలా ఐతే ఆయన ఇంకో పాట వినక్కర్లేదనా అని ఎవరో పెడార్థం తీస్తే నేను ఏం చెప్పలేను మరి. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని, భక్తుడిని. ఒక్కోసారి ఏమీ లేకపోతె సినిమా పాటలు రాసేయచ్చులే అనే ధైర్యం ఆయన పాట చలవే. ఉదాహరణకి నాకు ధైర్యాన్ని ఇచ్చిన రెండు మచ్చు తునకలు.
"అమ్మా తల్లే నోర్ముయ్యవే .. నోటి ముత్యాల్ జార్ నీయకే "
"వీచీ గాలి అందరి కోసం.. సూర్య కాంతి అందరి కోసం.." (దీనికి ఆయన టీ. కా . తాత్పర్యం కూడా ఇచ్చుంటారు ఎక్కడో )మాకు తెలుసుంటారా .. మరి.
"ఒక్కరికి మేలు చేస్తే అందరికీ మేలు జరుగుతుందిట .."
ఛా నిజమా అంటారా
అయ్యో .. ఐతే.. ఇది వినాల్సిందే "సఫలం లో నేతాజీ .. సఫలం లో గాంధీజీ "..
ఇది ఏంటి అంటే .. నాకు కూడా అర్థం కాలేదండీ . నన్ను involve చెయ్యకండీ.
-- కొ.కొ.


కొమ్మ వదిలేసి చాలా సేపైంది కదూ. సరే.. పాయింట్ లోకి. కొన్ని అధ్యాయాలు చదువుతున్నంత సేపు రమణ గారి కలవని వ్యక్తీ లేడు తెలియని కళాకారుడు లేడు, ఈయన వల్ల బోలెడు మంది నాకు కూడా తెలుస్తున్నారు అని ఒక పక్క ఆనందం. ఈ మహానుభావులు, కళాకారులు, కవులు కనీసం అన్నం కి నోచుకోలేని దుస్థితి ఏంటి. ఏమైపోయారు కవి రాజ పోషకులు అని బాధ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా బోలెడు మంది ఉన్నారేమో ఆకలితో అలమటించే కళాకారులు తెలియదు నాకు .కానీ నాకు తెలిసిన ప్రఖ్యాత కళాకారులు, మహామహులు, సాహితీ వినీలాకాసం లో ధ్రువ తారలుగా వెలిగిన వారు ఇలా ఆకలి తో అలమటించారా అని గుండె తరుక్కు పోయింది.
కొన్ని విషయాలు వింటుంటే ఈయనేంటి అన్నీ చెప్పేస్తున్నారు అని ఆశ్చర్యం కూడా కలిగింది. ముఖ్యంగా కన్నప్పగారిది (ఒక వేళ నేను అనుకున్న వ్యక్తే కరెష్టే ఐతే). ఎవరన్నా పరువు నష్టం దావా వేస్తారేమో అని భయం వేసింది.బాపు రమణల గురించి నాకు తెలిసిన కొంచానికి బోలెడు గౌరవం ఉండేది ఇంతకు మునుపు. ఇంకా తెలుసుకున్నాకా అది ఇంతింతై అది ఇంతై . అంతంతై అది అంతై. అంతే లేనంతైంది.



కోటి కొమ్మచ్చి ఆడియో తో పేచి ఎమన్నా ఉందా అంటే .. అన్నీ బాలు ఏ పాడితే, మాటాడితే బావుండేది. మిగతావారు బానే చదివినా బాలు గొంతు విన్నాకా .. రాజు చూసిన కళ్ళతో మొగుడిని మొట్ట బుద్ది అని సామెత.
కోతి కొమ్మచ్చి.. కొమ్మకి రెమ్మోచ్చి.. రెమ్మకి పువ్వొచ్చి.. అని మొదలెట్టారు. 



నాకు ఇలా అనిపించింది.
ఎద లో వెతలోంచి ఎన్నో కథలు పంచి
ఏడ్పుతో నవ్వించి. నవ్వులో ఏడ్పించి.
ఆకలి లో జోకులు నంచి

ఆరారా తినిపించి
జీవన సాగరం మధించి
జీవిత సత్యం బోధించి
నను మనిషిగ పెంచి
ననీ ఋణం తీర్చుకోను ఏమిచ్చి

మొత్తానికి తప్పక వినాల్సిన / చదవాల్సిన పుస్తకం అని మీకు ఇప్పటికే తెలుసనుకోండి. నేనే ఆలస్యంగా విన్నాను. నా కంటే ఆలస్యం చేసిన వాళ్ళుంటే త్వరపడండి.
అన్నట్టు బాపు రమణ లకి పద్మాలు ఎప్పుడు వస్తాయో. పాపం వాళ్ళు తమిళం మరీ అంత ఎక్కువ పని చెయ్యలేదే.

Thursday, August 19, 2010

కౌముది లో నా కథ

                          

              మొన్నోరోజు మా బంధువులు  కౌముది లో నా కథ చదివాం అని చెప్పారు. అప్పటి దాకా నాకు ఆ కథను కౌముది వారు ప్రచురించారని తెలియదు. వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటి లో బహుమతి పొందిన కథలు కౌముది లో వేస్తారని విన్నాను కానీ నా కథ  గత  సంచికలో రాకపోయేసరికి ప్రసంశా పత్రం వచ్చినవి వెయ్యరేమో అని సరిపెట్టుకున్నాను.

నేను  రాసిన  మొదటి కథకి (రాసినప్పుడు కథో కాదో కూడా నాకు తెలియదు)  గుర్తింపు రావడం ఆనందంగా  ఉంది. ఇంకా రాయాలని ఊపొచ్చింది.

ఈ కథని కౌముది ఆగస్టు సంచికలో  చదవచ్చు.

అన్నట్టు నా బ్లాగ్ లోని భోగి పిడక కథే ఇది.  ముగింపు మార్చి  పోటీకి పంపాను.

ఏది బావుందో చెప్పాలి మరి మీరు.

మనలోమన మాట. ఏదీ బావోకపోయినా చెప్పండి. మరేం  పర్లేదు.

.

Sunday, June 6, 2010

వేదం - ఇలాటి సినిమా తెలుగులో రాలేదు


గమ్యం సినిమా నాకు పెద్ద గొప్ప సినిమాలాగా అనిపించలేదు. కొంచం విభిన్నంగా ఉన్నఒక మామూలు సినిమా.
ఎందుకు ఈ దర్శకుడిని ఇంత ఎత్తేస్తున్నారు? బహుశా అతనికి సినిమా వాళ్లతో ఉన్న పరిచయం వల్లనేమో అనుకున్నాను. సాధారణంగా మొదటి సినిమా తో పైకెగిరి రెండవ సినిమాకి చతికిల పడే దర్శకుల్లో చేరిపోతాడేమో అనుకున్నాను. కానీ వేదం చూశాక ఇతను మంచి విషయం ఉన్న దర్శకుడు అని తెలిసింది.
అయిదు పాత్రలు, వారి కథలు ఒక చోట కలవడం. అది వారి జీవితాలని మలుపు తిప్పడం వేదం కథ అని చూచాయిగా తెలిసింది మీడియా లో సినిమా గురించి ఊదరకొట్టడం వల్ల. ఆడియో నాకు వినగానే బాగా నచ్చింది ముఖ్యంగా "మళ్ళీ పుట్టనీ", "ఏ చీకటీ" పాటలు. సాహిత్యం కూడా చాలా చక్కగా ఉంది. సరిగ్గా వాడుకుంటారా సినిమాకి అన్న అనుమానం మొదలైంది.
రకరకాల సమీక్షల  ద్వారా పాజిటివ్ టాక్ చూసి సినిమా బానే ఉంటుందిలే అనుకునే బయల్దేరాం. బే ఏరియా లో తెలుగు సినిమాకి  హాలు నిండడం, టికెట్ లు అయిపోయాయని ఇంకో ఎక్స్ట్రా షో వెయ్యడం మగధీర తరువాత ఇదేనేమో. 



సినిమా మొదలైంది. ఒక్కొక్క పాత్రని ప్రవేశపెట్టడం మెల్లగా కథని ఆవిష్కరించడం బావుంది. మనోజ్ పాత్రకి ఇంకెవరి నయినా పెట్టాల్సింది.  ఇంటర్వల్ సమయానికి బాగా తీసాడు, ఎక్కడా బోర్ కొట్టలేదు అనుకున్నాం (ఈ మధ్య ఇది కూడా కష్టం అయిపోయింది తెలుగు సినిమాలలో). ఇంటర్వల్ తరువాత ఇక కథలో లీనమయిపోయాం.క్లైమాక్స్ కి జనం నించి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పాత్రలు తప్ప నటులు కనపడలేదు. ముఖ్యంగా అనుష్కా, అల్లు అర్జున్ బాగా చేశారు. అనుష్కా కి స్నేహితురాలి(/స్నేహితుడి)గా చేసిన నటుడు అద్భుతంగా చేశాడు. నాకు మధుర్ బండార్కర్ సినిమాలలో కనిపించే పాత్రలు గుర్తొచ్చాయ్. ఇంచు మించు అందరు నటులు తమ పాత్రలకి ప్రాణం పోశారు.
ఈ సినిమాకి నిజమయిన హీరో క్రిష్. ఇతను ఇలాటి కొత్త రకం తెలుగు సినిమాలు తీసి మున్ముందు కొత్త శకం తెలుగు సినిమాకి ప్రతినిధి అవుతాడని ఒక ఆశ కలిగింది. నాకు కొత్త వారిలో (గత దశాబ్దం అనుకోండి) శేఖర్ కమ్ముల, సుకుమార్, చంద్ర శేఖర్  యేలేటి  సినిమాలు నచ్చుతాయ్. కానీ  అన్నిటిలోనూ ఏదో వెలితి ఉంటుంది.    శేఖర్ కమ్ముల సినిమాలలో టెక్నికల్ గా పర్ఫెక్షన్ ఉండదు. సినిమా మాధ్యమాన్ని బాగా వాడుకుని కథని ఎలివేట్ చేసే శక్తి లేదు కమ్ములకి. సుకుమార్ టెక్నికల్ గా పెర్ఫెక్షన్ ఉంటుంది, టేకింగ్ స్టైలిష్గా  ఉంటుంది   కానీ కథ లో ఏదో లోపం , వెలితి కనిపిస్తాయ్.లేకపోతె ఏదో ఎక్కడో తేడా చేసేస్తాడు.  ఇక చంద్రశేఖర్ యేలేటి. నాకు అనుకోకుండా ఒక రోజు చూసి మైండ్ బ్లాక్ ఐంది. తెగ నచ్చింది. ఇతని సినిమాలు ప్రయాణం తప్ప అన్నీ ఇష్టం నాకు. కాకపోతే కొంచం స్లో గా ఉంటాయ్.
వేదం లో మాత్రం క్రిష్ అనీ బాగా బ్యాలెన్స్ చేసాడు అనిపించింది. టెక్నికల్ గా పేరు పెట్టడానికి ఏం లేదు. కథ, కథనం, మాటలు చక్కగా రాసాడు. ఆర్ట్ ఫిలిం లా కాకుండా కమర్షియల్ సినిమా తీసాడు కొత్త కథ అయినా. ఇలాటి సినిమాలు మున్ముందు బోలెడు వచ్చి ఆరు పాటలు ఏడు ఫైటులు, పాత చింతకాయ పచ్చాడి కథలు, తాతల నాటి కథనాల నించీ తెలుగు సినిమాలు బయటపడాలని ఆశిస్తున్నాను.

Friday, March 26, 2010

పవర్ కట్




ఒక శనివారం 1992,
హైదరాబాద్ 
"అక్కా బయిటికి వెళ్దాం  రావే. ఎంచక్కా ఆడుకోవచ్చు. కరెంట్ వచ్చేవరకు"
"వద్దులేరా తెలుగు వార్తలు అయిపోయాయి. ఉర్దూ వార్తలు కూడా ఐపోవచ్చాయి. మనం వచ్చే లోపు కరెంటు వచ్చేస్తే సినిమా కొంచం మిస్ ఐపోతాంరా"
"కరెంటు అప్పుడే రాదే. పెద్ద మంట వచ్చింది ట్రాన్స్ ఫార్మర్ నించీ. ఎలెక్ట్రిక్  అంకుల్ రావడానికే గంట పడుతుంది."
"నీకెన్ని సార్లు చెప్పాను. ఎలెక్ట్రిక్ కాదు లైన్మెన్ అంకుల్ అని"
"అలా ఐతే నాన్న రోజూ రిక్షవాడిని. ఆటో వాడిని, షాపు వాడిని అందరినీ అంకుల్ అనకూడదు అని చెప్తే నువ్వు విన్నావేంటి. ఇప్పుడదంతా ఎందుకు. పక్కింటి ప్రియాంకా, ఎదురింటి తేజా కూడా వస్తారు. పద త్వరగా. రాత్రి 'కరెంట్ షాక్' ఆడితే భలే ఉంటుంది."
----- 



ఒక వేసవి రాత్రి , 1997
ఐనాపురం 
"అప్పుడే మొదలెట్టేశారా.. రాత్రైతే చాలు. కరెంటు పోయి చీకటిలో మొహాలు కనపడవేమో ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచించకుండా, మరీ ధైర్యంగా పాడేస్తున్నారు.  ఈ అంతాక్షరీ తో హడల కొట్టేస్తున్నారు. హాయిగా పెందరాడే పడుకోవచ్చు కదా. మేమైతే తాతయ్య పొలం నించి వచ్చేసరికి పడుకునే వాళ్ళం తెలుసా. ఇక మా అమ్మమ్మా వాళ్ళింట్లో ఐతే అయిదింటికి రాత్రి భోజనాలు. ఆరింటికి పడక."
"మావయ్యా. మీకు అదే  అలవాటు ఐపోయినట్టుంది. ఏడైతే  చాలు తెగ తూలిపోతారు. రాత్రి నిద్రకు ఆగలేరు. పొద్దున్నే మమ్మల్ని లేపకుండా ఉండలేరు. కనీసం ఎనిమిదింటి వరకూ కూడా పడుకోనీకుండా ఏంటిది."
"బాబయ్యా. మీ ఊళ్ళో సగం సేపు కరెంటు ఉండదు. మేము వచ్చినప్పటి నించీ ఒక్క రాత్రి అయినా కరెంటు ఉందా. టీవీ చూడలేం. బయటకెళ్ళి ఆడలేం. పోనీ ఊరంతా షికారు కెల్దామంటే మీ భయం తో మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. మర్రిచెట్టు వరకూ వెళ్ళేలోపు వెతకడం మొదలెట్టేస్తావ్ ఎక్కడున్నామా అని."
"నాన్నా ఆకోనీ..  నువ్వు యెల్లి పో. 

బావా ఇప్పుడు ప తొ పాదాలి నువ్వు "
------ 



ఒక బ్యాడ్ డే కి ముందు డే, 2001 
హైదరాబాద్ 
"రేయ్. ఏంట్రా ఇది. సిరాకు దొబ్బుతోంది. మొన్నటి దాకా ర్యాగింగ్. ఫ్రెషర్స్ ఐంది కాస్త ఎంజాయ్ చేద్దాం అనేలోపు ఈ ఎగ్జామ్స్ ."
"ఔన్రా. అయినా ఈ తొక్కలో ఇంజనీరింగ్ లో చేరకూడదు రా . చేరినా జే ఎన్ టి యు లో అసల జేర కూడదు. ఏడాదికి ఆరు ఇంటర్నల్సా. మొదలెట్టింది డిసెంబర్లో, ఆగష్టు లో ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్. అంటే ప్రతీ నేలా ఏదోకటి రాస్తూనే ఉన్నాం. ఇక నెక్స్ట్ సెం మరీ ఘోరం."
"మీరిద్దరూ ఆపండిరా. తొక్కలో డిస్కషన్. నేను రాజు గాడు ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్."
"ఎందుకు రా.. ఆడు అసలే  పరమ ఐరన్ లెగ్గు కదా"
"అందుకేరా. మనం చేసేదే వన్  డే బ్యాటింగ్. రేపు ఎగ్జాం పెట్టుకుని ఈ రోజు కూడా చదవకపోతే ఎదవ గిల్టీ ఫీలింగ్. పైగా మా నాన్న ఇదే పాయింట్ మీద ఏడాది దెప్పు తాడు. అదే కరెంట్ పొతే ఒక తొక్కలో ఎక్స్క్యూస్ అయినా ఉంటుంది."
"ఏడిసావ్లే. నీ తొక్కలో రీసనింగ్ నువ్వూ. మీ నాన్న జెనరేటర్ అద్దెకి తెచ్చి అయినా ఈ రోజు మీ ఇంట్లో కరెంట్ ఉంచుతాడు."
"రేయ్. రాజు గాడొచ్చాడు!!"
"కరెంట్ పోయింది"
"పదండ్రా.. నాకు బుర్ర హీటెక్కి పోయింది. చాయ్ పడాలి. అలా ఒక రౌండ్ ఏసోద్దాం."
-------- 



ఒక కరెంటు పోయిన రాత్రి, 2010 
బే  ఏరియా (కాలిఫోర్నియా)లో అమెరికన్లకంటే తెలుగు వారు ఎక్కువగా  ఉండే ఒకానొక నగరం.  
"వాట్. కరెంటు పోయిందా. నీ మొహం. ఆ ఫ్యూజ్ ట్రిప్ అయ్యి ఉంటుంది. సరిగ్గా చూడు"
"లేదు ఎవరికీ లేదు. జంక్షన్ లో ట్రాఫిక్ లైట్స్ కూడా పని చెయ్యట్లేదు. తెలుసా"
"ఔనా. Strange. ఇది నేనిక్కడికి వచ్చినప్పటి నించీ జస్ట్ రెండవ సారి అనుకుంటా. మూడేళ్ళలో "
"నేనొచ్చాకా అసల ఇదే మొదటి సారి"
"కాల్ చేసావా"
" గంట వరకూ రాక పోవచ్చని చెప్పారు. ఏం  చేద్దాం."
"వాక్  కెల్దామా?"
"నువ్వేనా ఆ మాటన్నది.. :)... ఓకే "
"అబ్బ.. ఎన్నాళ్ళయిందో.. చీకట్లో.. కటిక చీకట్లో.. ఇలా ..ఆకాశాన్ని చూసి.  పాలవిల్లుకి కట్టిన పళ్ళలా వేలాడుతున్నాయి కదూ నక్షత్రాలు. చంద్రుడు మరీ ముద్దొచ్చేస్తున్నాడు. బ్లాకు డ్రెస్ లో ఉన్న తమన్నాలా..  ఎపుడో  చదువుకునే రోజుల్లో చూసా."
"ఎవరిని?"

"కంగారు పడకు. తమన్నా అప్పటికి  సినిమాలలో రాలేదులే..






.. ఔను.. రోజూ ఇలాగే ఉంటుందా?"

" హ్మ్..  ఏమో. అవి ఆకాశంలోకి వచ్చేలోపు నువ్వు ఇంటికి రావు. నువ్వు వచ్చాక మనం బయటకి వెళ్ళం."
"ఛ. రోజూ ఒక గంట కరెంటు పోకూడదూ.."
"అబ్బా. ఎంతాశో.. ఇది అమెరికా. ఇప్పటికే టీవీ లో ఇదో పెద్ద న్యూస్ అయిపోయి ఉంటుంది. "
"ఏంటి మనం వాక్ కి రావడమా..??"
"హ్మ. $!@#$&#*($)_)(_)"
------
P.S. బే  ఏరియా  లో మొన్న రెండు నగరాలలో 85 నిమిషాలపాటు ఏక బిగిన పవర్ కట్.